లుసానే: భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ చరిత్ర సృష్టించాడు. పురుషుల విభాగంలో 2019 ఏడాదికి గానూ అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డును గెల్చుకున్నాడు. దీంతో ఈ అవార్డును గెల్చుకున్న తొలి భారత హాకీ ప్లేయర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. 1999లో ప్రవేశపెట్టిన తర్వాత ఓ భారత హాకీ క్రీడాకారుడు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికవ్వడం ఇదే తొలిసారి.
IPL 2020: ఆర్సీబీ 'వాలైంటైన్స్ డే' స్పెషల్ ఏంటో తెలుసా!!
'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు కోసం మన్ప్రీత్ సింగ్తో పాటు బెల్జియం ప్లేయర్ ఆర్థర్ వాన్ డోరెన్, అర్జెంటీనా ఆటగాడు లుకాస్ విల్లాలు పోటీ పడ్డారు. మన్ప్రీత్సింగ్కు 35.2 శాతం ఓట్లు పోలవ్వగా.. ఆర్థర్ 19.7 శాతం, లుకాస్ 16.5 శాతం ఓట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. భారత యువ మిడ్ఫీల్డర్ వివేక్ సాగర్ ప్రసాద్, మహిళల జట్టు స్ట్రైకర్ లాల్ రెమిసియామికి ఎఫ్ఐహెచ్ పురుషులు, మహిళల విభాగాల్లో 'రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్' అవార్డు దక్కింది.
'గతేడాది మేం ఆడిన ప్రతి టోర్నీలో మెరుగ్గా రాణించాం. జూన్లో ఎఫ్ఐహెచ్ ఫైనల్స్, బెల్జియంలో టెస్టు సిరీస్ ఆడి ఆతిథ్య జట్టుతో పాటు స్పెయిన్ను ఓడించాం. 2019లో మా అతిపెద్ద లక్ష్యమైన ఒలింపిక్స్ బెర్త్ సాధించాం. ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కినందుకు సంతోషంగా ఉంది. ఈ అవార్డును జట్టు సభ్యులకు అంకితమిస్తున్నా. భారత, అంతర్జాతీయ హాకీ సమాఖ్యలకు ధన్యవాదాలు' అని మన్ప్రీత్ అన్నాడు.
2011లో భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన మన్ప్రీత్ సింగ్ ఇప్పటి వరకు 263 అంతర్జాతీయ హాకీ మ్యాచ్లు ఆడాడు. ఇక 2012 లండన్ ఒలింపిక్స్, 2016 రియో ఒలింపిక్స్లో భారత్కు ఆడాడు. 2017లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇక వెనుదిరిగి చూడలేదు. ముఖ్యంగా 2019లో భారత హాకీ జట్టుకు అద్వితీయమైన విజయాలను అందించాడు. భువనేశ్వర్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ చాంపియన్గా భారత్ను నిలబెట్టడంతో పాటు టోక్యో ఒలింపిక్స్ బెర్తును ఖాయం చేశాడు. టోక్యోలో జరిగిన ఒలింపిక్ టెస్టు ఈవెంట్ విజేతగా.. సుల్తాన్ అజ్లాన్ షా కప్ ఫైనల్స్కు భారత్ను చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.