హైదరాబాద్: భారతీయులంతా ఆదరాభిమానాలతో.. ఎంతో పవిత్రంగా భావించే జాతీయ జెండాలో లోపం. ఇసుమంతైనా పట్టించుకోని నిర్వహక సంఘంతో ఆ లోటు కనిపిస్తున్నా.. మన క్రీడాకారులు ఏమీ చేయలేని నిస్సహాయత.
జూలై 21 నుంచి మొదలుకానున్న మహిళల హాకీ ప్రపంచ కప్ కోసం భారత మహిళల జట్టు లండన్ చేరుకుంది. ఈ క్రమంలో ప్రపంచ కప్ టోర్నీ ప్రమోషనల్ వేడుకలో భాగంగా ప్రతి జట్టు కెప్టెన్లంతా తమ జాతీయ జెండా పక్కన నిల్చున్నారు. భారత ప్రతినిధిగా టీమిండియా కెప్టెన్ రాణి రాంపాల్ కూడా త్రివర్ణ పతాకానికి పక్కగా నిల్చున్నారు.
కానీ, అందులో అశోక ధర్మ చక్రం లోపించిందని కనిపించలేదో ఏమో మరి. కాగా, 16 రోజుల పాటు జరగనున్న 36 మ్యాచ్ లలో టీమిండియా తొలి మ్యాచ్గా ఇంగ్లాండ్తో తలపడనుంది. టాప్ 10 ప్రపంచ ర్యాంకు కల్గి ఉన్న టీమిండియా ఎనిమిదేళ్లుగా ఇప్పటి వరకూ ఒక్క ప్రపంచ కప్లోనూ పాల్గొనలేదు. అంతేకాకుండా రాణి రాంపాల్.. దీపికా మినహాయించి ఎవ్వరూ ప్రపంచ కప్లో ఆడలేదు.
'మా జట్టు ఆడేందుకు సంసిద్ధంగా ఉంది. ఈ క్షణం కోసం దాదాపు ఆసియా కప్ విజయానంతరం సంవత్సర కాలం నుంచి ఎదురుచూస్తున్నాం. జట్టులో ప్రతి ఒక్కరికీ ప్రపంచ కప్లో ఆడడం ఒక కొత్త అనుభూతిగానే భావిస్తున్నాం' కెప్టెన్ రాణి రాంపాల్ తెలిపారు. భారత్ను పూల్-బీలో కేటాయించగా ఇంగ్లాండ్, ఐర్లాండ్, యూఎస్ఏలతో కలిసి టోర్నీలో పాల్గొంటుంది. కాగా, తన తొలి మ్యాచ్ జూలై 21న ఇంగ్లాండ్తో ఆడనుంది.