భారత జూనియర్ హాకీ జట్టు చెన్నైలో జరుగుతున్న జూనియర్ హాకీ వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బెల్జియంను ఓడించి సెమీఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంది. భారత్ బెల్జియంపై ఉత్కంఠభరితమైన పెనాల్టీ షూటౌట్లో 4-3 తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత జట్టు 2016 చరిత్రను పునరావృతం చేయడానికి కేవలం రెండు అడుగుల దూరంలో నిలిచింది. అయితే సెమీఫైనల్లో భారత జట్టుకు గత ప్రపంచ కప్ విజేత జర్మనీ నుంచి గట్టి సవాలు ఎదురుకానుంది. భారత జట్టు ప్రస్తుత ఫామ్ను చూస్తే, జర్మనీని ఓడించడం అసాధ్యం కాదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత హాకీ జట్టు పూల్లో బలహీనమైన జట్లు ఉండటం వల్ల క్వార్టర్ ఫైనల్ వరకు సులభంగా చేరుకుంది. కానీ శుక్రవారం రాత్రి చెన్నైలోని మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో తొలిసారి బలమైన జట్టును ఎదుర్కొంది. 13వ నిమిషంలోనే బెల్జియంకు చెందిన గాస్పర్డ్ కార్నెజ్-మాసెంట్ గోల్ చేసి ఆధిక్యంలోకి తీసుకువచ్చారు (0-1). తొలి అర్ధభాగంలో భారత్ 7 సార్లు సర్కిల్లోకి చొచ్చుకెళ్లినా.. రెండు పెనాల్టీ కార్నర్లను దక్కించుకున్నా గోల్ చేయలేకపోయింది. రెండో అర్ధభాగంలో టీమ్ మెంటార్ పి.ఆర్. శ్రీజేష్ వ్యూహాన్ని మార్చడంతో మూడో క్వార్టర్ ప్రారంభానికి 17 సెకన్ల ముందు భారత్కు పెనాల్టీ కార్నర్ లభించింది. దీనిని కెప్టెన్ రోహిత్ డ్రాగ్ ఫ్లిక్ ద్వారా గోల్గా మలచి స్కోరును 1-1తో సమం చేశాడు. 48వ నిమిషంలో వచ్చిన మరో పెనాల్టీ కార్నర్ను శారద నంద్ తివారీ పవర్ఫుల్ డ్రాగ్ ఫ్లిక్తో గోల్ చేసి భారత్ను 2-1తో ఆధిక్యంలోకి తీసుకువచ్చాడు.

చివరి 4 నిమిషాల వ్యూహంతో మ్యాచ్ మలుపు
బెల్జియం కోచ్ సీన్ డాన్సర్ చివరి నాలుగు నిమిషాలలో పెద్ద రిస్క్ తీసుకున్నారు. ఆయన తమ గోల్ కీపర్ను తొలగించి, ఆ స్థానంలో అదనపు ఆటగాడిని మైదానంలోకి పంపి భారత గోల్పోస్ట్పై వరుస దాడులు చేశారు. ఈ హై-రిస్క్ వ్యూహం ఫలించింది. ఆట ముగియడానికి కేవలం ఒక నిమిషం ముందు నాథన్ రోగ్ గోల్ చేసి స్కోరును 2-2తో సమం చేయడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్కు దారితీసింది.
షూటౌట్లో హీరోలు
పెనాల్టీ షూటౌట్లో భారత్ 4-3తో బెల్జియంపై అద్భుత విజయం సాధించింది. ఈ విజయానికి హీరోలు గోల్ కీపర్ ప్రిన్స్ దీప్ సింగ్, శారద నంద్ తివారీ. శారద నంద్ తివారీ మూడు అందమైన పెనాల్టీ స్ట్రోక్లను గోల్స్గా మలచగా.. ప్రిన్స్ దీప్ సింగ్ బెల్జియం డ్రాగ్ ఫ్లికర్ల నుండి వచ్చిన రెండు ముఖ్యమైన షాట్లను అడ్డుకున్నారు.
2016 చరిత్ర రిపీట్ అవుతుందా?
భారత్ ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే జూనియర్ హాకీ వరల్డ్ కప్ ఫైనల్కు చేరుకుంది. 2001లో ఆస్ట్రేలియాలోని హోబర్ట్లో జరిగిన ఫైనల్లో భారత్ అర్జెంటీనాను ఓడించి తొలిసారి టైటిల్ గెలుచుకుంది. 2016లో లక్నోలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ బెల్జియంను 2-1తో ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పుడు ఫైనల్ వరకు భారత్ ప్రయాణంలో సెమీఫైనల్లో గత విజేత జర్మనీని ఎదుర్కోవాల్సి ఉంది.