భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. వచ్చే ఏడాది మస్కట్ వేదికగా జరిగే హాకీ వరల్డ్ కప్లో బెర్తు ఖాయం చేసుకున్నారు. మహిళల ఏసియన్ హాకీ 5ఎస్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో చెలరేగారు. ఈ టోర్నీ ఫైనల్లో థాయ్ల్యాండ్ను ఏకంగా 7-2 గోల్స్ తేడాతో మట్టికరిపించారు. ఓమన్లోని సలాలా వేదికగా ఈ టోర్నీ జరిగింది. దీనిలో భారత అమ్మాయిలు అద్భుతంగా ఆడారు.
మ్యాచ్ ఆరంభమైన రెండో నిమిషంలోనే భారత ప్లేయర్ మరియానా కుజూర్ తొలి గోల్ చేసింది. అయితే ఆ తర్వాత థాయ్ల్యాండ్ ప్లేయర్లు కుంజీర ఇంపా, సాన్పోంగ్ కోర్ణకనోక్ ఇద్దరూ ఐదో నిమిషంలో రెండు గోల్స్ చేసి భారత్కు గట్టి సమాధానం ఇచ్చారు. దీంతో భారత జట్టు డిఫెన్స్లో పడాల్సి వచ్చింది. అయితే భారత అమ్మాయిలు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ఎదురు దాడికి దిగారు.

ఈ క్రమంలోనే మోనికా దీపి టొప్పో ఏడో నిమిషంలో అద్భుతమైన గోల్తో స్కోర్లు సమం చేసింది. ఆ వెంటనే 8వ నిమిషంలో కుజూర్ తన రెండో గోల్తో భారత్ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత 10, 27వ నిమిషాల్లో జ్యోతి రెండు గోల్స్తో రాణించింది. కెప్టెన్ నవజోత్ కౌర్ 23వ నిమిషంలో గోల్ చేసింది. చివర్లో మహిమా చౌదరీ 29వ నిమిషంలో గోల్తో భారత్కు తిరుగులేని ఆధిక్యం లభించింది.
హాకీ 5ఎస్ అనేది ఒక మినీ గేమ్. దీనిలో ఒక టీంలో కేవలం ఐదుగురు ప్లేయర్లు మాత్రమే ఉంటారు. ఒక గోల్ కీపర్, నలుగురు ప్లేయర్లు ఆడే వీలుంటుంది. మొత్తం 30 నిమిషాలు జరిగే ఈ మ్యాచ్ను రెండు భాగాలుగా విడదీస్తారు. సాధారణ హాకీ మ్యాచ్ జరిగే స్టేడియం కన్నా చిన్న మైదానంలో.. వేరే కొత్త రూల్స్తో ఈ మినీ గేమ్ జరుగుతుంది. ఈ మొట్టమొదటి 5ఎస్ వరల్డ్ కప్ వచ్చే ఏడాది జనవరి 24 నుంచి 31 వరకు మస్కట్ వేదికగా జరుగుతుంది.
భారత అమ్మాయిలు అద్భుతంగా రాణించి వరల్డ్ కప్కు అర్హత సాధించడంపై హాకీ ఇండియా సంతోషం వ్యక్తం చేసింది. భారత జట్టులో ఉన్న ప్లేయర్లు అందరికీ తలో రూ.2 లక్షల బహుమతి ప్రకటించింది. అలాగే సహాయక సిబ్బందికి రూ.లక్ష నజరానా ప్రకటించింది.