
టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో పతకం ఎన్నో ఆశలు రేపిన మహిళల హాకీ జట్టు.. చివరికి నిరాశ పరిచింది. కాంస్య పతకం కోసం సాగిన పోరులో రాణి రాంపాల్ సారథ్యంలోని టీమ్.. అద్భుతంగా పోరాడింది. చివరి వరకూ ప్రతి గోల్ కోసం చెమటోడ్చింది. బ్రాంజ్ మెడల్ను ముద్దాడటానికి గ్రేట్ బ్రిటన్తో తలపడిన మ్యాచ్లో చేదు ఫలితాన్ని చవి చూసింది. ఒకే ఒక్క గోల్ మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసింది. 3-4 గోల్స్ తేడాతో అటు మ్యాచ్, ఇటు పతకాన్ని చేజార్చుకునేలా చేసింది.
ఒక దశలో భారత జట్టు 3-2 గోల్స్ తేడాతో ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ప్రత్యర్థి జట్టు గ్రేట్ బ్రిటన్ తనకు దక్కిన అవకాశలను సద్వినియోగం చేసుకుంది. అటాకింగ్ గేమ్తో భారత్పై పైచేయి సాధించింది. ఒకే ఒక్క గోల్ తేడాతో చరిత్ర సృష్టించే అవకాశాన్ని పోగొట్టుకుని, విషాదంలో మునిగి ఉన్న భారత మహిళా హాకీ జట్టు ప్లేయర్లు, కోచ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. వారితో మాట్లాడారు. యువతకు స్ఫూర్తినిచ్చేలా పోరాడారని ప్రశంసల వర్షాన్ని కురిపించారు.

ఆటగాళ్ల ప్రతిభను గెలుపోటములు నిర్ధారించలేవని ఊరడించారు. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో భారత పతాకాన్ని ఎగురవేసేలా చేశారని, భారత పోరాట స్ఫూర్తి ఎలాంటిదో ప్రపంచ దేశాలకు తెలియజేశారంటూ కితాబిచ్చారు. సెమీ ఫైనల్స్లో భారత్ ఆడిన విధానం.. కోట్లాది మంది దేశ ప్రజలకు ప్రేరణను ఇచ్చిందని చెప్పారు. ప్లేయర్లు.. కోచ్.. సపోర్టింగ్ స్టాఫ్ ఇలా ప్రతి ఒక్కరినీ తాను పేరుపేరునా అభినందిస్తున్నానని ప్రధాని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ చెందొద్దని, ధైర్యాన్ని కోల్పోవద్దని అన్నారు. ప్లేయర్ నవ్నీత్ కంటికి గాయం కావడం పట్ల ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆమె కంటికి ఏమైందని ప్రశ్నించగా.. మ్యాచ్ సందర్భంగా గాయమైందని, నాలుగు కుట్లు పడ్డాయని టీమ్ కేప్టెన్ రాణి రాంపాల్ వివరించారు. దీనిపై బాప్ రె అంటూ ప్రధానిి ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కంటికి గాయం కాలేదు కదా? అని అడిగారు. సలీమా టెటె, వందన కఠారియా పేర్లను మోడీ ప్రత్యేకంగా ఉటంకించారు. ఎన్నో దశాబ్దాల కిందట భారత మహిళ హాకీ జట్టు పేరు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోందని అన్నారు. కోచ్ మరిజెనెతో కొద్దిసేపు మాట్లాడారు. హాకీ జట్టును అద్భుతంగా తీర్చిదిద్దారంటూ ప్రశంసించారు.