హాకీలో భారత అమ్మాయిలు అదరగొట్టారు. స్పెయిన్ హాకీ సమాఖ్య శత వసంత వేడుకల్లో భాగంగా ఒక అంతర్జాతీయ టోర్నీ నిర్వహించారు. దీనిలో పాల్గొన్న భారత మహిళలు అద్భుతంగా ఆడారు. ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం చెలాయించిన ఈ జట్టు రెండు విజయాలతో రాణించింది.
ఈ టోర్నీని డబుల్ రౌండ్ రాబిన్ విధానంలో నిర్వహించారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో భారత అమ్మాయిలు చెలరేగారు. ఆతిథ్య స్పెయిన్ జట్టును 3-0తో చిత్తు చేసి విజేతలుగా నిలిచారు. ఈ టోర్నీలో మొత్తం నాలుగు మ్యాచులు ఆడిన భారత జట్టు.. రెండింట విజయాలు సాధించి, రెండింటిని డ్రా చేసుకోవడం గమనార్హం.

భారత్ తరఫున వందన కటారియా (22వ నిమిషం), మోనిక (48), ఉదిత (58) కీలక సమయాల్లో గోల్స్ చేశారు. అదే సమయంలో స్పెయిన్కు ఒక్క గోల్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ టోర్నీలో మొత్తం 3 దేశాలు పోటీ పడటం గమనార్హం. వీటిలో రెండు విజయాలు సాధించిన భారత్ 8 పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది.
దీంతో టేబుల్ టాపర్గా నిలిచిన ఈ టీం.. ట్రోఫీ అందుకుంది. ఈ టోర్నీలో ఇంగ్లండ్తో ఆడిప తొలి మ్యాచ్ను భారత అమ్మాయిలు డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత రెండో మ్యాచులో స్పెయిన్తో హోరాహోరీ తలపడ్డారు. కానీ చివరకు 2-2తో మ్యాచ్ డ్రా చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న భారత జట్టు వరుస విజయాలు సాధించింది.
తాము ఆడిన మూడో మ్యాచ్లో 3-0తో ఇంగ్లండ్ను భారత అమ్మాయిలు చిత్తుగా ఓడించారు. ఇక చివరి లీగ్ మ్యాచ్లో స్పెయిన్పై కూడా అదే తరహాలో 3-0తో జయభేరి మోగించారు. ఈ టోర్నీలో భారత జట్టుకు ఓటమి లేకపోవడం విశేషం. ఇంగ్లండ్పై గెలుపుతో ఆత్మవిశ్వాసం సాధించిన భారత్..స్పెయిన్తో జరిగిన ఆఖరి లీగ్ పోరులో గెలిచి ట్రోఫీ అందుకుంది.