న్యూఢిల్లీ : ఓవైపు దేశ సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ పాక్ ఉగ్రవాదులను మట్టుబెడుతుంటే.. మరోవైపు మైదానంలో పాక్ జట్టును చిత్తు చేసింది ఇండియన్ అండర్-18 హాకి టీమ్. దాయాదుల మధ్య సరిహద్దు వాతారణం రణరంగాన్ని తలపిస్తుండడంతో.. మైదానంలో రెండు జట్ల పోరు మరింత ఉత్కంఠ రేకెత్తించింది.
కాగా, ఆసియా కప్ టోర్నమెంట్ లో భాగంగా.. గురువారం నాడు ఢాకా వేదికగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో 3-1తేడాతో పాక్ ను కంగు తినిపించింది ఇండియన్ హాకీ టీమ్. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే శివం ఆనంద్ గోల్ చేయడంతో జట్టుకు శుభారంభం లభించింది. ఆ తర్వాత దిల్ ప్రీత్ సింగ్ మరో గోల్ చేయడం.. మ్యాచ్ ద్వితీయార్థంలో సంజీప్ మూడో గోల్ సాధించడంతో ఇండియా మెరుగైన ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
అయితే ఆఖర్లో పాక్ తరుపున అలీఖాన్ గోల్ చేయడంతో.. భారత్ అధిక్యం 3-1 కు తగ్గింది. ఏదేమైనా పాక్ పై భారత్ విజయం ప్రస్తుతం దేశాభిమానుల్లో ఆనందం నింపుతోంది.మరో మ్యాచ్ లో తైపీ పై 5-1తేడాతో బంగ్లా విజయం సాధించడంతో.. తదుపరి మ్యాచ్ లో ఇండియన్ హాకి టీమ్ బంగ్లాదేశ్ తో తలపడనుంది.