హైదరాబాద్: భారత జాతీయ జట్టు క్రీడాకారులకు ఓ శుభవార్త ప్రకటించింది క్రీడా మంత్రిత్వ శాఖ. ఈ శాఖ టార్కెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) కింద ఇప్పటివరకు వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు చోటు కల్పిస్తూ వస్తోంది. ఈ క్రమంలో తొలిసారి భారత పురుషుల హాకీ జట్టు మొత్తాన్ని ఈ పథకంలోకి చేర్చింది. మొత్తం హాకీ జట్టును టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లోకి చేర్చుతున్నట్లు మిషన్ ఒలింపిక్ సెల్ (ఎమ్ఓసీ) పేర్కొంది.
ఇలా ఓ జట్టు మొత్తాన్ని ఈ పథకానికి ఎంపిక చేయడం ఇదే తొలిసారి. దీంతో ఇక భారత పురుషుల హాకీ జట్టులోని 18 మంది సభ్యులకు ప్రతి నెలా రూ.50,000 ఆర్థిక సాయం అందనుంది. ఈ మేరకు క్రీడా మంత్రిత్వశాఖలోని మిషన్ ఒలింపిక్ సెల్ నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న ప్రపంచ కప్, ఆసియా క్రీడల్లో ప్రదర్శన అనంతరం మహిళల హాకీ జట్టును కూడా 'టాప్స్'లో చేర్చే అంశం గురించి పరిశీలించనున్నారు. ఇటీవల నెదర్లాండ్స్లో జరిగిన ఛాంపియన్స్ట్రోపీలో భారత పురుషుల హాకీ జట్టు రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇటీవల అంతర్జాతీయ వేదికపై సత్తాచాటిన తెలుగు తేజం, జిమ్నాస్ట్ బుద్దా అరుణారెడ్డికి కూడా ప్రత్యేక అలవెన్సులు లభించనున్నాయి. ప్రస్తుతం బెల్జియంలో శిక్షణ తీసుకుంటున్న అరుణా రెడ్డి, ఆశిష్ కుమార్ల కోసం రూ. 14 లక్షలు కేటాయించారు. వీరితో పాటు ఉజ్బెకిస్తాన్లో శిక్షణ తీసుకుంటున్న ప్రణతీ నాయక్ కోసం రూ. 7.74 లక్షలు ప్రకటించారు. స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్కు జార్జియాలో ప్రత్యేక శిక్షణకు గాను రూ. 6.62 లక్షలు... ఇతర రెజ్లర్లు బజరంగ్ పూనియా, సుమిత్ల కోసం రూ. 3.22 లక్షలు మంజూరు చేశారు.
డేవిస్ కప్ సభ్యుడు రామ్కుమార్ రామనాథన్కు ఆసియా క్రీడల ప్రత్యేక శిక్షణ నిమిత్తం రూ..12.57 లక్షలు కేటాయించారు. ఆర్చరీ సామాగ్రి కొనుగోలుకు రూ. 11.48 లక్షలు కేటాయించారు. దీంతో పాటు ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, త్రిష, రజత్ చౌహాన్ల ప్రత్యేక శిక్షణ కోసం ఇటాలియన్ కోచ్ సెర్గియో పగ్నికి రూ. 4.04 లక్షలు ప్రత్యేకంగా కేటాయించారు.