
టోక్యో: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్ క్రీడల సన్నాహకంలో భాగంగా జరుగుతున్న టెస్ట్ ఈవెంట్లో భారత పురుషులు, మహిళల జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి. మంగళవారం జరిగిన పోరులో భారత పురుషుల జట్టు 6-3 గోల్స్తో ఆతిథ్య జపాన్ను ఓడించింది. ఈ విజయంతో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. భారత్ మొత్తం 6 గోల్స్ చేయగా.. అందులో స్ట్రయికర్ మన్దీప్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్తో చెలరేగాడు.
మూడో నిమిషంలో నీలకంఠ శర్మ గోల్ చేసి భారత్ ఖాతా తెరిచాడు. 7వ నిమిషంలో సందీప్ గోల్ కొట్టి స్కోరును రెట్టింపు చేశాడు. ఈ సమయంలో మన్దీప్ రెచ్చిపోయాడు. 9, 29, 30 నిమిషాల్లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టి భారత్ను విజయ తీరాలకు చేర్చాడు. గుర్జంత్ సింగ్ (41వ ని) ఒక గోల్ చేసాడు. జపాన్ తరఫున కెంటారో (25వ ని), టనాకా (36వ ని), కజుమా (52వ ని) గోల్స్ సాధించారు. జపాన్తో మ్యాచ్లో పురుషుల జట్టు పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన భారత్.. బుధవారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది.
భారత మహిళల జట్టు చైనాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ను 0-0తో డ్రా చేసుకుంది. మ్యాచ్ మొత్తం ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వని భారత్.. ఎక్కువగా డిఫెన్స్కే ప్రాధాన్యతనిచ్చింది. దీంతో భారత మహిళల జట్టు పాయింట్ల పట్టికలో 5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్ చేరింది. రాణీ రాంపాల్ బృందం బుధవారం జరిగే ఫైనల్లో జపాన్తో తలపడనుంది. గత కొద్ది కాలంగా రాణీ రాంపాల్ బృందం అద్భుత విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో ఫైనల్లో కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి.