జకార్తా: ప్రతిష్ఠాత్మక క్రీడా సంరంభం ఆసియా క్రీడలు 2018లో శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు అసలైన బిగ్ ఫైట్ జరగనుంది. భారీ అంచనాలతో పోటీలోకి దిగిన మహిళల హాకీ జట్టు ఫైనల్స్కి చేరుకుంది. శుక్రవారం మహిళల హాకీ ఫైనల్స్లో భారత్, జపాన్ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ప్రపంచ మహిళల హాకీ ర్యాంకింగ్స్లో భారత్ 9వ స్థానంలో ఉండగా ప్రస్తుతం జపాన్ 14వ స్థానంలో కొనసాగుతోంది.
వీరిరువురు మధ్య జరగనున్న మ్యాచ్లో గెలిచిన విజేత జట్టు 2020 ఒలింపిక్స్కి అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచినట్టయితే, 1982 తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణం గెలుచుకోవడం ఇదే మొదటిసారి కానుంది. దీంతో ప్రస్తుతం యావత్ ప్రపంచ హాకీ క్రీడాకారులు, హాకీ క్రీడా అభిమానుల దృష్టి అంతా ఈ ఫైనల్ మ్యాచ్ పైనే ఉంది.
భారత్ గెలిచి 2020 ఒలంపిక్స్ కి అర్హత సాధించడంతోపాటు 36 ఏళ్ల తర్వాత భారత్ కి గోల్డ్ మెడల్ తీసుకొస్తుందా లేదా అంటే ఈ మ్యాచ్ ఫలితం తేలేవరకు వేచిచూడాల్సిందే. ఆఖరి మ్యాచ్లో చైనాపై విజయం సాధించిన భారత్.. చైనాను 1-0తేడాతో ఓడించి 20 ఏళ్ల తర్వాత కాంస్యం దక్కేలా చేసింది. 1982లో ఢిల్లీ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్లో భారత్ స్వర్ణాన్ని దక్కించుకుంది.
ఇప్పటివరకూ హాకీలో ఆసియా గేమ్స్లో 9 సార్లు పాల్గొన్న భారత్కు ఒక స్వర్ణం, ఒక రజతం, మూడు కాంస్యాలు మాత్రమే దక్కాయి. ర్యాంకుల వారీగా చూస్తే ప్రపంచ నెంబర్ 9 ర్యాంకు భారత్.. నెంబర్ 14వ ర్యాంకు జపాన్తో తలపడనుంది.