

న్యూ ఢిల్లీ: 2013 నుంచి భారత్-బెల్జియం 19 సార్లు తలపడగా.. భారత్ ఐదింట్లో మాత్రమే గెలిచింది. బెల్జియం 13 పర్యాయాలు నెగ్గింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. మరోసారి టీమిండియా పాత పద్ధతినే అనుసరించింది. ఆరంభంలో అద్భుతంగా ఆడిన భారత్ చివరి వరకూ నిలబెట్టుకోలేకపోయింది. ప్రపంచకప్లో కఠిన ప్రత్యర్థిపై గెలిచే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకుంది. హాకీ ప్రపంచకప్లో బెల్జియంతో జరిగిన మ్యాచ్ను 2-2తో డ్రా గా ముగించింది.
టీమిండియా తరఫున హర్మన్ప్రీత్ సింగ్ (39వ నిమిషంలో), సిమ్రన్ జీత్ సింగ్ (47వ నిమిషంలో) గోల్స్ చేశారు. బెల్జియం జట్టు నుంచి హెండ్రిక్స్ అలెగ్జాండర్ (8వ నిమిషంలో), గ్వాంగనార్డ్ సిమన్ (56వ నిమిషంలో)నే రాణించారు. ఆట మొదలైన ఎనిమిదో నిమిషంలోనే అలెగ్జాండర్ గోల్ చేసి బెల్జియంను 1-0తో ఆధిక్యంలో నిలిపాడు.
ఇక తర్వాత స్కోరు సమం చేయడానికి టీమిండియా ఆపసోపాలు పడింది. బంతిని నియంత్రణలో ఉంచుకొంటూ ప్రత్యర్థి డిఫెన్స్ను ఛేదించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో 39వ నిమిషంలో హర్మన్ గోల్ చేసి భారత్ను పోటీలోకి తెచ్చాడు. ఆతిథ్య జట్టు అదే ఊపులో 47వ నిమిషంలో అద్భుతమైన వ్యూహంతో రెండో గోల్ను సిమ్రన్ జీత్ ఫీల్డ్ గోల్గా నమోదు చేశాడు. దీంతో టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది.
ఇక బెల్జియం డిఫెన్స్ను కాచుకుంటే చాలు విజయమే అనుకుంటున్న తరుణంలో ఆటగాళ్లూ బాగానే ఆడారు. ఆట మరో 4 నిమిషాల్లో ముగుస్తుందనగా భారత్ బంతిపై నియంత్రణ కోల్పోయింది. ఆఖరి వరకూ పోరాడకపోవడమే టీమిండియా చేసిన తప్పు. బెల్జియం దానినే అవకాశంగా మార్చుకుని సిమన్ గోల్ చేయడంతో స్కోరు సమమైంది. ఆ
స్కోరుతోనే మ్యాచ్ ముగించాల్సి వచ్చింది.