
న్యూఢిల్లీ: పురుషుల హాకీ ప్రపంచకప్ 2023 ఆతిథ్య హక్కుల కోసం భారత్ బిడ్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే మూడుసార్లు హాకీ ప్రపంచకప్ టోర్నీని నిర్వహించిన భారత్.. మరోసారి ఆతిథ్యమిచ్చేందుకు బిడ్ వేసింది. ఇక హాకీ ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు చేజిక్కించుకునేందుకు భారత్ బలంగా ప్రయత్నాలు చేస్తోంది.
2023 జనవరి 13 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న ఈ మెగా టోర్నీని నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హాకీ ఇండియా (హెచ్ఐ) అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్)కు నివేదిక అందజేసింది. ఈ టోర్నీని నిర్వహించేందుకు భారత్తో పాటు బెల్జియం, మలేసియాలు కూడా బిడ్ వేశాయి. అయితే ఆ రెండు దేశాలు 2022 (జూలై 1-7)లో టోర్నీ నిర్వహించాలని కోరుతున్నాయి. ఇప్పటికే హాకీ ప్రపంచకప్ను భారత్ మూడుసార్లు నిర్వహించిన విషయం తెలిసిందే.
మహిళల ప్రపంచకప్ ఆతిథ్యానికి జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్, మలేసియా, న్యూజిలాండ్ దేశాలు పోటీపడుతున్నాయి. పురుషుల, మహిళల ఆతిథ్య హక్కులు దక్కిన తుది దేశాల పేర్లను ఎగ్జిక్యూటివ్ బోర్డు వచ్చే నెల 8న అధికారికంగా ప్రకటించనుంది. ' మెగా టోర్నీలను నిర్వహించడానికి ఎక్కువ దేశాలు పోటీపడడం ఆనందదాయకం. ఇది క్రీడాభివృద్ధికి దోహదం చేస్తుంది. నాలుగేండ్లకోసారి జరిగే ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆతిథ్యమిచ్చేందుకు ఎనిమిది దేశాల మధ్య పోటీ నెలకొంది' అని ఎఫ్ఐహెచ్ సీఈవో థెరీ వెయిల్ తెలిపారు.
వరుస విజయాలతో దూకుడుమీదున్న భారత జూనియర్ హాకీ జట్టు సుల్తాన్ జొహర్ కప్ ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. రౌండ్ రాబిన్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్లో భారత్ 5-1తో ఆస్ట్రేలియాను చిత్తుచేసి తుది పోరుకు అర్హత సాధించింది. శైలానంద్ లక్రా (26వ, 29వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో మెరిస్తే.. దిల్ప్రీత్ సింగ్ (44వ ని.లో), గుర్సాహిబ్జిత్ సింగ్ (48వ ని.లో), మన్దీప్ మోర్ (50వ ని.లో) ఒక్కో గోల్ కొట్టి విజయంలో తమవంతు పాత్ర పోషించారు.