
హైదరాబాద్: నాలుగు దేశాల ఇన్విటేషన్ హాకీ టోర్నమెంట్లో భాగంగా బుధవారం జపాన్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్లోని బ్లేక్ పార్క్లో జరిగిన ఈ మ్యాచ్లో రూపీందర్ సింగ్ ఏడో నిమిషంలోనే గోల్ సాధించి భారత్కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
ఆ తర్వాత 12, 28, 35, 45, 41 నిమిషాల్లో భారత్ గోల్స్ సాధించి 6-0 తేడాతో జపాన్పై ఘన విజయం సాధించింది. దీంతో తొలి మ్యాచ్లో విజయం సాధించి ఈ టోర్నీని భారత్ ఘనంగా ప్రారంభించింది. గురువారం జరిగే మ్యాచ్లో బెల్జియంతో భారత్ హాకీ జట్టు తలపడనుంది.
ఇదిలా ఉంటే భారత్-జపాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ని భారత అండర్ 19 క్రికెటర్లు వీక్షించారు. ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీ కోసం ప్రస్తుతం పృథ్వీ షా నేతృత్వంలోని భారత యువ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు నాలుగు దేశాల ఇన్విటేషన్ హాకీ టోర్నీ కోసం భారత హాకీ జట్టు కూడా న్యూజిలాండ్లో పర్యటిస్తోంది.
ఇందులో భాగంగా భారత్-జపాన్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకించేందుకు న్యూజిలాండ్లోనే ఉన్న యువ భారత క్రికెట్ జట్టు అక్కడికి వెళ్లింది. కోచ్ రాహుల్ ద్రవిడ్తో కలసి వచ్చిన భారత యువ జట్ట స్టాండ్స్లో నుంచి భారత హాకీ జట్టును ఎంతగానో ప్రోత్సాహించారు.
టీమిండియా ఆటగాళ్లు హాకీ మ్యాచ్ను వీక్షించే ఫొటోలను బీసీసీఐ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. 'మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకించి మద్దతిచ్చిన అండర్ 19 క్రికెటర్లకు ధన్యవాదాలు. ఐసీసీ వరల్డ్ కప్లో తలపడుతోన్న మీకు గుడ్లక్. మాతో పాటు యావత్తు భారతదేశం మీ వెనుక ఉంది. దేశం గర్వపడేలా చేయండి' అని హాకీ ఇండియా రీట్వీట్లో పేర్కొంది.