న్యూఢిల్లీ: బీజింగ్ ఒలింపిక్స్ క్వాలిఫైంగ్ మ్యాచులో భారత్ ఓటమికి బాధ్యత వహిస్తూ హాకీ కోచ్ జాక్వమ్ కార్వోలో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన స్టాఫ్ కూడా రాజీనామా చేస్తుంది. ఫలితం రాబట్టడంలో తాను విఫలమైనందున రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు జాక్వమ్ చెప్పారు. తాను 11 నెలల క్రితం ఈ పదవిని చేపట్టిన సమయంలో ఫలితాలు రాబట్టకపోతే రాజీనామా చేస్తానని చెప్పానని, తాను మాట నిలబెట్టుకుంటున్నానని ఆయన చెప్పారు. భారత హాకీ అభిమానిగా ఓటమి తనను బాధపెట్టిందని ఆయన చెప్పారు. తన రాజీనామాపై ఇంకా తాను భారత హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడు కెపియస్ గిల్ తో మాట్లాడలేదని, అయితే తన నిర్ణయం మారదని ఆయన చెప్పారు. తనతో పాటు అసిస్టెంట్ కోచ్ లు మహిందర్ పాల్ సింగ్, రమేష్ పరమేశ్వరన్ రాజీనామాల విషయంలో దృఢంగా ఉన్నామని ఆయన చెప్పారు. ప్రస్తుత జట్టులో సామర్ధ్యం ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కోర్ టీంను కొనసాగిస్తూ కొంతమంది జూనియర్లను జట్టులోకి తీసుకోవాలని ఆయన అన్నారు. హాకీ సమాఖ్య ఉపాధ్యక్షుడు మహేంద్ర బాత్రా కూడా తన పదవికి రాజీనామా చేశారు. శాంటియాగోలో ఆదివారం జరిగిన ప్రపంచ హాకీ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ ఫైనల్స్ లో పరాజయం పాలవడంతో భారత్ ఒలింపిక్ ఆశలకు గండి పడింది. ఆట మొదటి భాగంలోనే రెండు గోల్స్ చేసిన ఇంగ్లాండ్ ఈ ఫైనల్స్ మ్యాచ్ లో భారత్ ను ఏ దశలోనూ విజయంవైపు వెళ్లనీయలేదు. ఫైనల్స్ లో బ్రిటన్ 2-0 గోల్స్ తేడాతో భారత్ ను ఓడించింది. ఈ మ్యాచ్ లో పరాజయంతో భారత్ ఈ ఏడాది బీజింగ్ ఒలింపిక్స్ కు దూరమైంది. 1928 తరువాత ఒలింపిక్స్ కు భారత్ దూరం కావడం ఇదే తొలిసారి.