హైదరాబాద్: నాలుగు దేశాల ఇన్విటేషన్ హాకీ టోర్నమెంట్లో భాగంగా జరగనున్న తొలి మ్యాచ్లో భారత హాకీ జట్టు జపాన్తో తలపడనుంది. బుధవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో భారత్, జపాన్, బెల్జియం, న్యూజిలాండ్ దేశాలు పాల్గొంటున్నాయి.
ఇప్పటికే న్యూజిలాండ్ చేరుకుని ఐదు రోజులపాటు శిక్షణ పూర్తిచేసుకున్న భారత జట్టు ఇక్కడి వాతావరణానికి అలవాటుపడింది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్లో భారత్, జపాన్తో తలపడనుంది. జపాన్పై భారత్కు మంచి రికార్డు ఉండటం కలిసొచ్చే అంశం.
గతేడాది ఆసియా కప్లో భారత్ 5-1 తేడాతో జపాన్ను చిత్తుగా ఓడించింది. భారత జట్టు తమ రెండో మ్యాచ్లో 18న బెల్జియంతో తలపడుతుంది. ఒలింపిక్ రజత పతక విజేత బెల్జియంతో మ్యాచ్ భారత్కు కీలకం కానుంది. అయితే గతేడాది భువనేశ్వర్లో జరిగిన హాకీ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లో బెల్జియంపై భారత్ విజయం సాధించడం విశేషం.
మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భారత్ భావిస్తోంది. ఈ సందర్భంగా జట్టు ప్రధాన ఆటగాడు రూపీందర్పాల్ సింగ్ మాట్లాడుతూ 'జట్టు మంచి ఫాంలో ఉంది. మా ప్రాక్టీస్ బాగుంది. మ్యాచ్లో గెలిచి టోర్నీని ఘనంగా ప్రారంభించాలని అనుకుంటున్నాం. భువనేశ్వర్లో జరిగిన హాకీ వరల్డ్ లీగ్లో మంచి ప్రదర్శనే చేశాం. ఈ టోర్నీలోనూ రాణిస్తాం' అని అన్నాడు.
కాగా, న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత్ అండర్-19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ని భారత హాకీ జట్టు ఆటగాళ్లు కలిశారు. ప్రస్తుతం ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ కోసం పృథ్వీ షా నేతృత్వంలోని భారత యువ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. వరుసగా రెండు విజయాలతో భారత యువ జట్టు క్వార్టర్స్లోకి ప్రవేశించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.