ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్లో భారత్, పాకిస్తాన్ వైరం చూడాలనుకున్న ఫ్యాన్స్కు నిరాశే మిగిలింది. వరుణుడి వల్ల ఫలితం లేకుండానే ఈ మ్యాచ్ ముగిసింది. అయితే హాకీ ఫ్యాన్స్కు మాత్రం ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఫుల్ జోష్ పంచింది. హాకీ 5ఎస్ ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు జయభేరి మోగించింది. శనివారం జరిగిన పురుషుల హాకీ 5ఎస్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై ఉత్కంఠ భరిత విజయం సాధించింది.
షూటవుట్ వరకు దారి తీసిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ను 2-0తో తమ ఖాతాలో వేసుకుంది. దీంతో వచ్చే ఏడాది జరిగే ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ 5ఎస్ వరల్డ్ కప్కు కూడా అర్హత సాధించింది. కొన్ని రోజుల క్రితమే భారత మహిళల జట్టు కూడా ఈ ఫీట్ సాధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు సెమీఫైనల్లో మలేషియాను భారత జట్టు 10-4 తేడాతో చిత్తుగా ఓడించి ఫైనల్లో అడుగు పెట్టింది.

అదే సమయంలో ఒమన్ను 7-3 తేడాతో ఓడించిన పాకిస్తాన్ కూడా దాయాదుల పోరు కోసం ఫైనల్ చేరింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రెండు జట్లు నువ్వా? నేనా? అన్నట్లు పోరాడాయి. భారత టీంలో మహమ్మద్ రహీల్ రెండు గోల్స్తో ఆకట్టుకున్నాడు. అతను 19వ నిమిషంలో, అలాగే 26వ నిమిషంలో గోల్స్ చేశాడు. కానీ భారత జట్టు ఖాతా తెరిచింది మాత్రం జుగరాజ్ సింగ్.
అతను ఏడో నిమిషంలో భారత్ తరఫున తొలి గోల్ సాధించాడు. ఆ తర్వాత పదో నిమిషంలో మణీందర్ సింగ్ మరో గోల్ చేశాడు. అయితే ఈ మ్యాచ్లో అసలు గోల్స్ ఖాతా తెరిచింది మాత్రం పాకిస్తాన్ జట్టే. ఆ టీం కీలక ప్లేయర్ అబ్దుల్ రెహ్మాన్ మ్యాచ్ మొదలైన ఐదో నిమిషంలోనే తొలి గోల్ చేశాడు. అలాగే 13వ నిమిషంలో పాక్ కెప్టెన్ అబ్దుల్ రాణా కూడా గోల్ చేశాడు.
ఆ తర్వాత 14వ నిమిషంలో జిక్రియా హయత్, 19వ నిమిషంలో అర్షద్ లియాఖత్ కూడా చెరో గోల్తో మెరిశారు. కానీ రెండు జట్లూ కూడా విన్నింగ్ గోల్ చేయలేకపోయాయి. దీంతో 4-4తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ కారణంగా షూటవుట్ ద్వారా విజేతను నిర్ణయించారు. ఈ షూటవుట్లో భారత్ తఫున గుర్జోత్ సింగ్, మణీందర్ సింగ్ ఇద్దరూ గోల్స్ సాధించారు.
ఇక పాకిస్తాన్ టీంలో అర్షద్ లియాఖత్, మహమ్మద్ ముర్తజా ఇద్దరూ షూటవుట్లో పాల్గొన్నారు. కానీ వీళ్ల షాట్లను అడ్డుకున్న గోల్ కీపర్ సూరజ్ కర్కేరా.. భారత్కు విజయాన్ని అందించాడు. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న హాకీ ఇండియా.. ప్లేయర్లకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షలు, సహాయక సిబ్బంది ఒక్కొక్కరికీ రూ.లక్ష నజరానా ప్రకటించింది.
ఈ క్రమంలో భారత జట్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 'హాకీ 5ఎస్ ఆసియా కప్ విజేతలు. ఈ అద్భుత విజయం సాధించిన పురుషుల హాకీ జట్టుకు శుభాకాంక్షలు. మన ఆటగాళ్ల అకుంఠిత దీక్షకు ఇది నిదర్శనం. ఈ విజయంతో వచ్చే ఏడాది ఒమన్లో జరిగే హాకీ 5ఎస్ వరల్డ్ కప్లో కూడా స్థానం సంపాదించారు. మన ప్లేయర్ల పట్టుదల, శ్రద్ధ దేశం మొత్తానికి స్ఫూర్తి ఇస్తూనే ఉంది' అని మోదీ పేర్కొన్నారు.