
హైదరాబాద్: నాలుగు దేశాల హాకీ టోర్నీలో భారత హాకీ జట్టు విజయం సాధించింది. అద్భుతమైన డిఫెన్స్, ఎటాకింగ్ వ్యూహంతో శనివారం న్యూజిలాండ్లోని బ్లేక్ పార్క్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ను 3-1 తేడాతో ఓడించింది. జపాన్పై 4-1తేడాతో విజయం సాధించిన బెల్జియంతో ఆదివారం జరిగే ఫైనల్లో భారత హాకీ జట్టు తలపడనుంది.
శనివారం నాటి మ్యాచ్లో ఆట ప్రారంభం నుంచి భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో హర్మన్ప్రీత్ (2 నిమిషం), దిల్ ప్రీత్ సింగ్ (21 నిమిషం), మన్దీప్ సింగ్ (47 నిమిషం)లో గోల్స్ చేశారు. ప్రారంభం నుంచే న్యూజిలాండ్పై గోల్ పోస్టుపై పదే పదే దాడులకు యత్నించారు.
మన్దీప్ సహకారంతో రెండో నిమిషంలోనే టీమిండియాకు పెనాల్టీ కార్నర్ లభించింది. ఈ అవకాశాన్ని చక్కని ఫ్లిక్ ద్వారా హర్మన్ప్రీత్ సద్వినియోగం చేసుకుని తొలి గోల్ సాధించాడు. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత బంతిని భారత ఢిపెన్స్ తన నియంత్రణలో ఉంచుకుంది.
ఈ సమయంలో గోల్ చేసేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తన్న తరుణంలో 21వ నిమిషంలో సహచరుడు ఇచ్చిన పాస్ను దిల్ప్రీత్ నేరుగా ప్రత్యర్థి గోల్పోస్ట్లోకి కొట్టడంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో భారత జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శన కనబర్చింది.
అదే సమయంలో న్యూజిలాండ్కు లభించిన పెనాల్టీ కార్నర్ను ఆ జట్టు ఆటగాడు కేన్ రసెల్ 42వ నిమిషంలో గోల్గా మలిచాడు. ఆ తర్వాత 47వ నిమిషంలో సర్కిల్లోని ప్రవేశించిన మన్దీప్ సింగ్ అద్భుత గోల్ చేయడంతో భారత్ 3-1తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత చివరి వరకు గోల్ నమోదు కాకపోవడంతో 3-1తో భారత్ విజయం సాధించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.