తొలి 10 నిముషాల్లోనే గోల్
మ్యాచ్ ప్రారంభమైన తొలి 10 నిముషాల్లోనే భారత్ మొదటి గోల్ను నమోదు చేసింది. జపాన్ ఢిఫెన్స్ను చేధిస్తూ హర్మన్ప్రీత్ సింగ్ భారత్ ఖాతాలో తొలి గోల్ను నమోదు చేశాడు. అయితే అంతకుముందే జపాన్కు రెండు సార్లు గోల్ చేసే అవకాశం వచ్చింది. అయితే భారత ఆటగాళ్లు బలమైన డిఫెన్స్తో అడ్డుకోవడంతో అది సాధ్యపడలేదు. అనంతరం మ్యాచ్ 23వ నిముషంలో దిల్ప్రీత్ సింగ్ గోల్ చేసి భారత్ అధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఇక 34వ నిముషంలో జరామన్ప్రీత్ సింగ్ గోల్ సాధించడంతో భారత్ అధిక్యం 3-0కు చేరుకుంది. భారత్ అధిక్యం అంతకంతకు పెరిగిపోతుండడంతో జపాన్ కట్టడి చేసే ప్రయత్నం చేసింది. భారత ఆటగాళ్లు.. జపాన్ ఆటగాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ గోల్ కోట్పై దాడి చేశారు.
మరింత దూకుడు పెంచిన భారత్
అనంతరం భారత ఆటగాళ్లు మరింత దూకుడు పెంచారు. ఈ క్రమంలో 46వ నిముషంలో సుమిత్ గోల్ సాధించాడు. దీంతో భారత్ అధిక్యం 4-0కు పెరిగింది. ఆ తర్వాత 53వ నిముషంలో హర్మన్ప్రీత్ సింగ్ మరోసారి గోల్ చేశాడు. ఈ మ్యాచ్లో హర్మన్ప్రీత్ సింగ్కు ఇది రెండో గోల్. హర్మన్ గోల్తో భారత్ అధిక్యం 5-0కు పెరిగింది. అయితే ఆ వెంటనే 54వ నిముషంలో గోల్ సాధించి షంషేర్ సింగ్ జపాన్కు షాకిచ్చాడు. దీంతో భారత్ అధిక్యం 6-0కు పెరిగింది. 54 నిముషాలు పూర్తయ్యేసరికి 6-0తో టీమిండియా తిరుగులేని అధిక్యంలో నిలిచింది. చివరి వరకు అదే అధిక్యాన్ని కొనసాగించింది. దీంతో ఏకపక్షంగా సాగిన ఈ పోరులో జపాన్పై 6-0 గోల్స్ తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది.
ఓటమెరుగని భారత్
టీమిండియా అంతకుముందు తన తొలి లీగ్ మ్యాచ్లో కొరియాతో మ్యాచ్ను 2-2తో డ్రా చేసుకుంది. అయితే ఆ తర్వాతి మ్యాచ్లో బంగ్లాదేశ్పై 9-0 తేడాతో ఘనవిజయం సాధించింది. అనంతరం పాకిస్థాన్ను 3-1 తేడాతో చిత్తు చేసింది. కాగా లీగ్ స్టేజ్లో 10 పాయింట్లతో భారత్ అగ్ర స్థానంలో ఉండగా, 6 పాయింట్లతో కొరియా రెండో స్థానంలో ఉంది. 5 పాయింట్లతో జపాన్ మూడో స్థానంలో ఉంది. 2 పాయింట్లతో పాకిస్థాన్ నాలుగో స్థానంలో ఉంది. ఇక అతిథ్య బంగ్లాదేశ్ పాయింట్ల ఖాతా తెరవకుండా చిట్ట చివరన ఉంది.


Click it and Unblock the Notifications












