
చండీగఢ్: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2020లో పాల్గొన్న పంజాబ్ ఆటగాళ్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధి. ఒలింపిక్స్లో పాల్గొన్న భారత హాకీ జట్టు బంగారు పతకం సాధిస్తే.. అందులోని పంజాబ్ ఆటగాళ్లకు ఒక్కొక్కరికీ రూ.2.25 కోట్ల చొప్పున నజరానా అందజేస్తామని గుర్మీత్ సింగ్ సోధి శుక్రవారం వెల్లడించారు. మొదట జట్టు మొత్తానికి రూ.2.25 కోట్లు అని ప్రకటించగా.. ఆపై అది పంజాబ్ ఆటగాళ్లలో ఒక్కొక్కరికి మాత్రమే అని మంత్రి అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు. విశ్వక్రీడల్లో పంజాబ్కు చెందిన 11 మంది ఆటగాళ్లు భారత జట్టులో ఉన్నారు.
శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 5-3 గోల్స్ తేడాతో జపాన్ను చిత్తు చేసింది. ఈ విజయంతో గ్రూప్-ఎలో భారత్ రెండో స్థానంతో లీగ్ స్టేజ్ను ముగించింది. మొత్తం ఐదు మ్యాచ్లలో నాలుగు గెలిచి, ఒకదాంట్లో ఓడిన భారత్.. 12 పాయింట్లతో ఆస్ట్రేలియా (13) తర్వాతి స్థానంలో ఉంది. జపాన్తో మ్యాచ్లో గుర్జంత్ సింగ్ 2.. హర్మన్ప్రీత్ సింగ్, షంషేర్, నీలకంఠ శర్మ తలా ఒక గోల్ చేశారు. భారత్ వరుస విజయాలతో అదరగొడుతూ క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది.
భారత్ ప్రస్తుతమున్న పరిస్థితులు చూస్తుంటే.. ఏదో ఒక పతకం ఖాయంగా కనిపిస్తోంది. మరో రెండు విజయాలు సాధిస్తే.. భారత్ ఖాతాలో పతకం చేరడం ఖాయంగా కనపడుతోంది. కాగా భారత హాకీ జట్టు 1980లో చివరిసారి ఒలింపిక్స్లో పతకం సాధించింది. 40 సంవత్సరాలు గడుస్తున్నా.. మరో పతకం రాలేదు. అందుకే పతకం కోసం భారత్ ఎంతో ఆశతో ఎదురుచూస్తోంది. ఈసారైనా ఒలింపిక్స్లో పతకం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
భారత మహిళల హాకీ జట్టు మరో విజయం సాధించింది. పూల్ ఏ లోని తన చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 4-3 తేడాతో గెలిచింది. వందన కటారియా మూడు గోల్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఇవాళ జరిగే మరో మ్యాచ్లో ఐర్లాండ్ తన చివరి మ్యాచ్లో గ్రేట్ బ్రిటన్ చేతిలో ఓడితేనే.. మన జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మొత్తం ఆరు జట్లలో నాలుగు క్వార్టర్స్ చేరుతాయి.