
హైదరాబాద్: భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న వరల్డ్ హాకీ లీగ్ ఫైనల్ టోర్నీని భారత్ డ్రాతో ప్రారంభించింది. శుక్రవారం హోరాహోరీ సాగిన తొలి మ్యాచ్ను భారత్ 1-1 గోల్స్తో డ్రాగా ముగించింది. కొత్త కోచ్ ఆధ్వర్యంలో భారత హాకీ జట్టు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది.
మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు తమ జోరుని కొనసాగించాయి. ఆస్ట్రేలియాను పూర్తిగా డిఫెన్స్లోకి నెడుతూ పలు అవకాశాలను సాధించింది. ఈ క్రమంలో భారత్కు పెనాల్టీకార్నర్ లభించినా రూపీందర్ సింగ్ గోల్గా మలచడంలో విఫలమయ్యాడు. తొలి పది నిమిషాలు పూర్తిగా మ్యాచ్ భారత్ చేతుల్లోనే ఉండగా 13వ నిమిషంలో ఆసీస్కు పెనాల్టీ కార్నర్ లభించింది.
అయితే గోల్కీపర్ ఆకాశ్ చిట్కే కుడివైపు డైవ్ చేసి అద్భుత రీతిలో వారి ప్రయత్నాన్ని సమర్థంగా అడ్డుకున్నాడు. దీంతో తొలి క్వార్టర్ గోల్ లేకుండానే ముగిసింది. రెండో క్వార్టర్ 18వ నిమిషంలో ఇన్సైడ్ సర్కిల్ నుంచి ఆకాశ్ దీప్కు గోల్ చేసే అవకాశం వచ్చినా అది వైడ్గా వెళ్లింది. ఆ తర్వాత 20వ నిమిషంలో మన్దీప్సింగ్ అద్భుత గోల్తో భారత్ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.
అయితే ఈ ఆనందరం ఎక్కువ సేపు నిలవలేదు. మరో నిమిషంలోనే తమకు లభించిన పెనాల్టీ కార్నర్ను హేవర్డ్ గోల్గా మలిచాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది. ఆ తర్వాత ఆసీస్కు మరో పెనాల్టీ కార్నర్ లభించినా భారత డిఫెన్స్ దానిని సమర్థవంతంగా అడ్డుకుంది. ఆ తర్వాత రెండు జట్లు ఎంతగా పోరాడినా ఆధిక్యాన్ని సాధించలేకపోయాయి.
32వ నిమిషంలో భారత్కు లభించిన రెండు వరుస పెనాల్టీ కార్నర్ అవకాశాలు వృథా అయ్యాయి. అటు ఆస్ట్రేలియాకు లభించిన మూడు కార్నర్ అవకాశాలను భారత ఆటగాళ్లు అద్భుతంగా అడ్డుకున్నారు. 45వ నిమిషంలో ఆకాశ్దీప్ ఆడిన షాట్ బార్పైనుంచి వెళ్లింది. చివరి క్వార్టర్లో పైచేయి కోసం ఇరు జట్లు అద్భుత ప్రదర్శన చేశాయి.
దీంతో భారత్కు రెండు గోల్ అవకాశాలు త్రుటిలో తప్పడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మరో మ్యాచ్లో జర్మనీ 2-0తో ఇంగ్లాండ్ను ఓడించింది. గ్రామ్బాచ్ (19వ ని), రూర్ క్రిస్టఫర్ (25వ ని) గోల్స్ కొట్టి జర్మనీని గెలిపించారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.