హైదరాబాద్: భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నీలో ఆతిథ్య భారత్ రెండో మ్యాచ్లో అభిమానులను నిరాశపరిచింది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాను కంగారెత్తించిన భారత్.. శనివారం ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో చేజేతులా ఓటమి పాలైంది. కనీసం డ్రాగా ముగించాల్సిన మ్యాచ్ను భారత్ చేజార్చుకుంది.
దీంతో మ్యాచ్ను 2-3 తేడాతో ఓడిపోయి పూల్-బిలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. భారత్ తరఫున ఆకాశ్దీప్(47ని), రూపిందర్పాల్ (50ని)గోల్స్ చేశారు. మరోవైపు ఇంగ్లండ్ జట్టులో సామ్ వార్డ్(43ని, 57ని) డబుల్ గోల్స్తో విజృంభించగా, చివర్లో డేవిడ్ గుడ్ఫీల్డ్(25ని) మరో గోల్ చేశాడు.
టోర్నీలో భాగంగా సోమవారం ఆఖరి మ్యాచ్లో భారత్ జర్మనీతో తలపడనుంది. మ్యాచ్ ప్రారంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో తొలి క్వార్టర్లో ఎలాంటి గోల్ నమోదు కాలేదు. ఇక రెండో క్వార్టర్లో భారత స్ట్రెకర్లు ఎస్వీ సునీల్, మణ్దీప్సింగ్ తమకు అందివచ్చిన పాస్లను గోల్స్గా మలువలేకపోయారు.
అదే సమయంలో ఇంగ్లాండ్ భారత డిఫెన్స్పై ఒత్తిడి పెంచి ఫలితం రాబట్టింది. రెండో క్వార్టర్ 25వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్ను గుడ్ఫీల్డ్ గోల్ చేయడంతో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 43వ నిమిషంలో ల్యూక్ టేలర్ లాంగ్ పాస్ను హర్మన్ప్రీత్సింగ్ సరిగ్గా నిలువరించలేకపోయాడు.
దీనిని అనుకూలంగా మలచుకున్న సామ్ వార్డ్ గోల్ చేయడంతో ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత భారత్కు వెంటవెంటనే రెండు పెనాల్టీ కార్నర్లు దక్కినప్పటికీ గోల్స్గా మలచడంలో విఫలమయ్యారు. ఈ సమయంలో మూడు నిమిషాల వ్యవధిలో ఆకాశ్దీప్సింగ్(47ని), రూపిందర్పాల్(50ని) గోల్స్ చేసి ఆధిక్యాన్ని 2-2 సమం చేశారు.
ఇక, 2-2తో మ్యాచ్ డ్రా దిశగా సాగుతున్న సమయంలో.. డిఫెండర్ల ఏమరుపాటు కారణంగా 57వ నిమిషంలో సామ్ వార్డ్ రెండో గోల్ చేయడంతో మ్యాచ్ ఇంగ్లండ్ కైవసమైంది. ఇదే గ్రూప్లో జర్మనీ, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. పూల్-ఎలో జరిగిన రెండు మ్యాచ్ల్లో బెల్జియం 3-2తో అర్జెంటీనాపై, స్పెయిన్ 3-2తో నెదర్లాండ్స్పై విజయం సాధించాయి.