
హైదరాబాద్: హాకీ ప్రపంచకప్ టోర్నీకి భారత్ అదిరిపోయే రీతిలో ఆతిథ్యమిస్తున్నది. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఒడిశా ప్రభుత్వం కనివినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. ప్రపంచకప్ దృష్ట్యా వివిధ దేశాల నుంచి తరలిరానున్న పర్యాటకులను కట్టిపడేసేలా దాదాపు 100 కోట్ల వ్యయంతో నగరం మొత్తాన్ని జిగేల్మనే రీతిలో సుందరీకరించింది. మొత్తం 16 జట్ల సమాహారంతో 18 రోజుల పాటు జరగబోతున్న హాకీ వరల్డ్కప్ ఆరంభ వేడుకలు మంగళవారం అట్టహాసంగా జరిగాయి.
ఇదిలా ఉంటే ఈ ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టు ఎవరూ ఊహించని రీతిలో కష్టపడింది. అంటే ప్రాక్టీసు విషయంలో కాదు. టోర్నీకి హాజరయ్యేందుకు కావాల్సిన ఖర్చుల విషయంలో... అంతర్జాతీయ క్రికెట్లో మాదిరిగా దక్షిణాఫ్రికా హాకీలో గట్టి జట్టుగా ఇంకా నిరూపించుకోలేదు. దీంతో నిధుల లేమితో భారత్లో జరుగుతున్న హాకీ ప్రపంచకప్లో పాల్గొనేందుకు సొంత డబ్బులు పెట్టుకొని రావలసి వచ్చింది. సఫారీ కోచ్ మార్క్ హాప్కిన్స్ స్వయంగా ఈ విషయం వెల్లడించారు.
'ఎక్కువ హాకీ ఆడితే దక్షిణాఫ్రికా మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. కానీ మాకున్న సమస్యల్లా మ్యాచ్లు ఆడేందుకు నిధులు లేకపోవడమే. ప్రపంచకప్ ఆడేందుకు మేం సొంతడబ్బులు ఖర్చుపెట్టుకొని భారత్కు వచ్చాం. కొంతమంది స్పాన్సర్లు ఉన్నా వారిచ్చే డబ్బులు ప్రపంచకప్ బడ్జెట్కు సరిపోవు. ప్రస్తుతం లోటుతో ఉన్నాం.'
'ఆ లోటు భర్తీ చేయకపోతే ఆటగాళ్లే డబ్బులు ఖర్చుపెట్టుకోవాలి. ప్రపంచకప్లో ప్రతి మ్యాచ్ మాకు కీలకమే. ఆతిథ్య జట్టుతో తొలి మ్యాచ్ ఆడుతున్నందుకు ఆత్రుతగా ఉన్నాం. ఆత్మవిశ్వాసంతో ఆడతాం. రెండు వైపులా ఒత్తిడి ఉంది. ఆతిథ్య జట్టు కాబట్టి టీమిండియాపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. నాణ్యమైన హాకీ ఆడటమే మా లక్ష్యం' అని హాప్కిన్స్ అన్నారు.