
న్యూఢిల్లీ: హాకీ ప్రపంచకప్ తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాను 5-0తో చిత్తు చేసి ఊపు మీదున్న భారత్కు పెద్ద సవాల్. ఆదివారం పూల్-సి మ్యాచ్లో రియో ఒలింపిక్స్ రజత పతక విజేత బెల్జియంతో భారత జట్టు తలపడనుంది. ఈ పూల్లో గట్టి ప్రత్యర్థి అయిన బెల్జియంను ఓడిస్తే భారత్కు నాకౌట్ తలుపులు తెరుచుకున్నట్లే. తొలి మ్యాచ్ విజయంతో మన్ప్రీత్సింగ్ సారథ్యంలోని భారత్ జోరు మీదుంది. అయితే డిఫెన్స్, అటాకింగ్లో పటిష్ఠంగా ఉండే బెల్జియంను ఓడించడం మన్ప్రీత్ సేనకు అంత సులభం కాదు.
ఆఖరిసారిగా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తలడిన మ్యాచ్లో ఇరుజట్లూ 1-1స్కోరుతో డ్రాగా ముగించాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మన్ప్రీత్ సింగ్, సిమ్రన్జిత్ సింగ్, ఆకాశ్దీప్సింగ్, లలిత్ ఉపాధ్యాయలతో కూడిన భారత ఫార్వర్డ్స్దళం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. సిమ్రన్జిత్ సింగ్ రెండు గోల్స్తో అదరగొట్టగా..మిగిలిన స్ట్రైకర్లు తలో గోల్తో మెరిశారు. కాగా, మన్ప్రీత్ కెప్టెన్సీలోని మిడ్ఫీల్డ్తో పాటు లెఫ్ట్బ్యాక్, రైట్ బ్యాక్ ఆటగాళ్లు సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
సఫారీ జట్టుపై చెలరేగిన మన్దీప్సింగ్, సిమ్రన్జీత్సింగ్, ఆకాశ్దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్ మరోసారి సత్తా చాటాల్సి ఉంది. బెల్జియంతో మ్యాచ్లో భారత డిఫెండర్లు హర్మన్ప్రీత్ సింగ్, బీరేంద్ర లాక్రా, సురేందర్ కుమార్ సహా భారత సూపర్ గోల్కీపర్ శ్రీజేష్ రాణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రెడ్ లయన్స్ ఆటగాళ్లు ఆరంభం నుంచి దూకుడుగా ఆడతారు. పదే పదే ప్రత్యర్థి గోల్పోస్టుపై దాడులకు దిగుతారు.
దూకుడుగా ఆడే బెల్జియం స్ట్రైకర్లను .. భారత డిఫెండర్లు నిలువరిస్తే మిగతా పనిని భారత ఫార్వర్డ్స్ పూర్తి చేస్తారు. ఈ మ్యాచ్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామని బెల్జియం కోచ్ మెక్ లియోడ్ చెప్పాడు. తామై అంతే సిద్ధంగా ఉన్నామని భారత కోచ్ హరేంద్ర సింగ్ తెలిపాడు. మరో గ్రూప్ సీ మ్యాచ్లో కెనడా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.
2013 నుంచి భారత్-బెల్జియం 19 సార్లు తలపడగా.. భారత్ ఐదింట్లో మాత్రమే గెలిచింది. బెల్జియం 13 పర్యాయాలు నెగ్గింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. మరి ఆదివారం ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. శనివారం జరిగిన పూల్-డి మ్యాచ్లో పాకిస్థాన్ 0-1తో జర్మనీ చేతిలో పోరాడి ఓడింది. మరో మ్యాచ్లో నెదర్లాండ్స్ 7-0తో మలేసియాను చిత్తు చేసింది.