
చండీగఢ్: హాకీ దిగ్గజం, భారత్ మూడు ఒలింపిక్ స్వర్ణాలు సాధించడంలో కీలకపాత్ర పోషించిన బల్బీర్ సింగ్ సీనియర్ (96) ఆరోగ్యం విషమించింది. తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆయనను శుక్రవారం సాయంత్రం ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనను వెంటిలెటర్పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు.
న్యూమోనియాతో పాటు, 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న బల్బీర్ సింగ్ను శుక్రవారం చండీగఢ్ నగరంలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని బల్బీర్ మనువడు కబీర్ శనివారం వెల్లడించారు. బల్బీర్ ప్రస్తుతం వెంటిలేటర్ మీదే ఉన్నా.. పరిస్థితి శుక్రవారం కంటే మెరుగ్గానే ఉన్నట్టు తెలిపారు. మనవడితో కలిసి బల్బీర్ చండీగఢ్లో నివసిస్తున్నారు.
ఆసుపత్రిలో చేరిన బల్బీర్కు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని కబీర్ తెలిపారు. న్యూమోనియాతో బాధపడుతున్న బల్బీర్.. గతంలో 108 రోజులు పాటు ఆసుపత్రిలో ఉన్నారు. ఆ తర్వాత కోలుకుని ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో ఆయన కోలుకున్నారు. ఇప్పుడు మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
భారత హాకీ జట్టు అనేక విజయాల్లో బల్బీర్ సింగ్ సీనియర్ పాలుపంచుకున్నారు. 1948, 1952, 1956లలో ఒలింపిక్స్లలో స్వర్ణం గెలుపొందిన భారత జట్టులో బల్బీర్ సభ్యుడు. మార్చి మొదటి వారంలో భారత హాకీ మాజీ ఆటగాడు బల్బీర్ సింగ్ కుల్లర్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. 1968 ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత జట్టులో సభ్యుడైన కుల్లర్.. గతంలో జాతీయ జట్టు సెలెక్టర్గానూ పనిచేశారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు