హైదరాబాద్: భారత హాకీ జట్టు జాతీయ కోచ్ రోలెంట్ ఓల్ట్స్మన్ను హాకీ ఇండియా ఉద్వాసన పలికింది. అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టు ఆశించినంతగా రాణించకపోవడానికి కోచ్ ఓల్ట్స్మన్దే బాధ్యతని, భవిష్యత్లోనూ అతని వ్యూహాలు పని చేయవన్న నిర్ణయానికి వచ్చిన హాకీ ఇండియా అతనికి ఉద్వాసన పలుకుతూ సంచలన నిర్ణయం తీసుకుంది.
కొత్త కోచ్ను ఎంపిక చేసే వరకు హై పెర్ఫామెన్స్ సంచాలకుడు డేవిడ్ జాన్ జట్టు బాధ్యతలు చేపట్టనున్నారు. మూడు రోజులుగా జరుగుతున్న హాకీ ఇండియా అత్యుత్తమ ప్రదర్శన, అభివృద్ధి కమిటీ సమావేశం శనివారం ముగిసింది. కమిటీ సమావేశం అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.
అనంతరం హాకీ సెలక్షన్ కమిటీ చైర్మన్ హర్బీందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. కోచ్గా హాలెండ్కు చెందిన ఓల్ట్స్మన్ కేవలం భారతజట్టులో సమన్వయం పెంచడంలోనూ ఫిట్నెస్ను మెరుగుపరుచడంలో విజయవంతమైనా అంతర్జాతీయ టోర్నీలలో మాత్రం విజయాలను అందించలేకపోయాడని చెప్పారు.

ముఖ్యంగా హాకీ విజయాల్లో నిలకడ లోపం ఎక్కువగా ఉన్నట్టు హాకీ ఇండియా పేర్కొంది. 2016, 17లో జట్టు ప్రదర్శన బాగానే కనిపిస్తున్నా, ఆసియా కప్ గెలవడమే బెంచ్మార్క్ కాదని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ హర్బిందర్ సింగ్ వెల్లడించారు.
అతని వ్యూహాలు సమీప భవిష్యత్లో జట్టు విజయాలకు దోహదం చేయలేవన్న కారణంతో అతన్ని తప్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. 2018 ఆసియా క్రీడలు, ప్రపంచకప్, 2020 ఒలింపిక్స్ క్రీడల సందర్భంగా ఇప్పుడు కఠిన చర్య తీసుకోక తప్పలేదని వివరించారు.