న్యూఢిల్లీ: పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్(పీహెచ్ఎఫ్)కు హాకీ ఇండియా (హెచ్ఐ) సాయమందించేందుకు ముందుకు వచ్చింది. గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో భారత అభిమానులకు పాకిస్థాన్ ఆటగాళ్లు అసభ్య సంజ్ఞలు చూపించడం వివాదాస్పదమైంది. అప్పటి నుండి భారత్, పాకిస్థాన్ మధ్య హాకీ సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఐతే ఆనాటి సంగతులు గుర్తు పెట్టుకోకుండా ఇబ్బందుల్లో ఉన్న పీహెచ్ఎఫ్కు సాయం చేయడానికి హెచ్ఐ ముందుకొచ్చింది. తమ ఆటగాళ్లకు, కోచ్లకు రోజువారీ భత్యం కూడా చెల్లించలేక పీహెచ్ఎఫ్ శిక్షణ శిబిరాన్ని రద్దు చేసుకుంది.

ఈ విషయం తెలుసుకున్న హెచ్ఐ ఆర్థిక సాయం చేస్తామంటూ పొరుగు దేశ సమాఖ్యకు లేఖ రాసింది. ఒలింపిక్స్ అర్హత టోర్నీకి ముందు పాకిస్థాన్ జట్టుకు ఈ శిబిరం కీలకం కావడంతో హెచ్ఐ వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చింది. దీనిపై పీహెచ్ఎఫ్ స్పందించాల్సి ఉంది.
కాగా, ప్రతిష్ఠాత్మక సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్లో భారత్ తన పోరాటాన్ని ఆదివారం కొరియాతో జరిగే మ్యాచ్తో ప్రారంభిస్తోంది. ఇప్పటికే 2016 రియో ఒలింపిక్స్లో పాల్గొనే అర్హత సంపాదించిన భారత జట్టు పలువురు యువ ఆటగాళ్లతో ప్రయోగాలు చేయడానికి ఈటోర్నీని వేదికగా ఎంచుకుంది.