హాకీ ఇండియా లీగ్లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తాజాగా నువ్వా నేనా అంటూ సాగిన పోరులో షూటౌట్లో సూర్మా హాకీ క్లబ్పై గెలుపొంది, మూడో విజయాన్ని అందుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన షూటౌట్ నిర్వహించగా అందులో 4-3 గోల్స్ తేడాతో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు గెలిచింది. కాగా, ఈ సీజన్లో 5 మ్యాచ్లాడి 3 విజయాలు, 2 పరాజయాలను అందుకున్న హైదరాబాద్ తూఫాన్స్.. 7 పాయింట్లతో టేబుల్ లో ఐదో స్థానంలో నిలిచింది.
తాజా పోరులో సూర్మా హాకీ క్లబ్ తరఫున నికోలస్ డెల్లా (8వ ని.లో) ఓ గోల్ కొట్టాగా, హైదరాబాద్ తూఫాన్స్ జట్టు తరఫున అమన్దీప్ లక్రా (40వ నిమిషంలో) గోల్ కొట్టాడు. దీంతో జట్టు స్కోరు సమం అయింది. ఆ తర్వాత ఇరు జట్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మ్యాచ్ షూటౌట్ కు వెళ్లాల్సి వచ్చింది. ఇకపోతే హైదరాబాద్ తూఫాన్స్ తన తర్వాత మ్యాచ్ ను వేదాంత కళింగ లాన్సర్స్తో తలపడనుంది.

ఇదే లీగ్ లో తాజాగా జరిగిన మరో మ్యాచ్లో యూపీ రుద్రాస్ జట్టు 3-1 గోల్స్ తేడాతో దిల్లీ ఎస్జీ పైపర్స్పై గెలుపొందింది. యూపీ రుద్రాస్ తరఫున ఫ్లోరిస్ (30వ నిమిషంలో), కాన్ రసెల్ (43వ ని.లో), టంగ్యూ కసిన్స్ (54వ ని.లో) తలా ఓ గోల్ కొట్టగా... దిల్లీ జట్టు తరఫున జాక్ వెటన్ (29వ ని.లో) ఒక గోల్ కొట్టాడు.
మహిళల లీగ్ షురూ
గతంలో కేవలం పురుషుల కోసమే ఈ హాకీ లీగ్ నిర్వహించగా, ఈ ఏడాది నుంచి మహిళల కోసం కూడా ప్రత్యేకంగా పోటీలు నిర్వహించనున్నారు. ఆదివారం నుంచి తొలి ఉమెన్స్ హాకీ ఇండియా లీగ్ (డబ్ల్యూహెఐఎల్) ప్రారంభం కానుంది.
రెండు వారాల పాటు ఈ టోర్నీ సాగనుంది. నాలుగు ఫ్రాంఛైజీలు పోటీ పడనున్నాయి. దిల్లీ ఎస్జీ పైపర్స్, ఒడిశా వారియర్స్, బెంగాల్ టైగర్స్, సూర్మా హాకీ క్లబ్ బరిలో దిగనున్నాయి.. రాంచీలోని జైపాల్ సింగ్ హాకీ స్టేడియం వేదికగా ఈ పోటీలు జరుగుతాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీలను నిర్వహిస్తారు. ఆదివారం తొలి మ్యాచ్లో ఒడిశా వారియర్స్, దిల్లీ ఎస్జీ పైపర్స్ తలపడతాయి.
సవిత పునియా, నేహా గోయల్, నవ్నీత్ కౌర్, సలీమా టెట్, ఉదిత లాంటి భారత స్టార్ల ప్లేయర్లతో పాటు ఛార్లెట్ ఎజిల్బెర్ట్ (బెల్జియం), ఇబి జాన్సన్ (నెదర్లాండ్స్), ఇవా డిగోడ్ (నెదర్లాండ్స్), డెల్ఫినా మెరినో (అర్జెంటీనా) లాంటి అంతర్జాతీయ ప్లేయర్లు కూడా ఈ లీగ్ బరిలో దిగనున్నారు.