
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా గేమ్స్లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సొంతం చేసుకుంది. కాంస్య పతకం కోసం భారత్.. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తలపడింది. పాకిస్థాన్తో జరిగిన ఈ పోరులో భారత్ 2-1తో విజయం సాధించింది.
పాక్పై తమ ఆధిపత్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోతున్న భారత్.. గత మూడు నెలల్లో ఏకంగా రెండుసార్లు ఓడించింది. భారత్ తరఫున ఆకాశ్దీప్సింగ్(3ని), హర్మన్ప్రీత్సింగ్(50ని) గోల్స్ చేయగా, ముహమ్మద్ అతీక్(52ని) పాక్కు ఏకైక గోల్ అందించాడు.
సెమీస్లో మలేషియా చేతిలో అనూహ్య ఓటమి నుంచి తేరుకున్న డిఫెండింగ్ చాంపియన్ భారత్.. పాక్తో మ్యాచ్లో సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే భారత్ తన తొలి గోల్ నమోదు చేసింది. మూడో నిమిషంలోనే లలిత్ ఉపాధ్యాయ్ నుంచి పాస్ అందుకున్న ఆకాశ్దీప్సింగ్.. పాక్ గోల్కీపర్ ఇమ్రాన్ భట్ను కంగుతినిపిస్తూ భారత్కు తొలి గోల్ అందించాడు.
రెండు నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థి జట్టుకు అవకాశమొచ్చినా గోల్గా మలుచలేకపోయింది. ఆ తర్వాత భారత్ తమ దూకుడును మరింతగా పెంచింది. బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకుంటూ పాక్పై ఒత్తిడి తీసుకొచ్చింది. రెండో క్వార్టర్లో పుంజుకున్న దాయాది జట్టు భారత గోల్పోస్ట్పై దాడులకు పాల్పడింది.

మహమ్మద్ దిల్బీర్, ఐజాజ్ అహ్మద్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మ్యాచ్ సగం పూర్తయ్యే వరకు భారత్ 1-0 ఆధిక్యంలోనే కొనసాగింది. నాలుగో క్వార్టర్లో భారత్ తమ ఆధిక్యాన్ని పెంచుకునే ప్రయత్నంలో పాక్ గోల్పోస్ట్పై దాడులు చేసింది. అయితే మ్యాచ్ 50వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ను హర్మన్ప్రీత్ గోల్ చేయడంతో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆ తర్వాత పాక్ ఒక గోల్ మాత్రమే చేసింది. దీంతో భారత్ 2-1తో మ్యాచ్లో విజయం సాధించి కాంస్యాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ ఆసియా క్రీడల్లో భారత్కు ఇది 69వ పతకం. భారత్ ఇప్పటి వరకు 15 స్వర్ణాలు, 24 రజతాలు, 30 కాంస్యాలను తన ఖాతాలో వేసుకుంది. ఆసియా క్రీడల చరిత్రలో ఇన్ని పతకాలు గెలవడం భారత్కు ఇదే మొదటిసారి.