
హైదరాబాద్: భారత హాకీ దిగ్గజం మైఖేల్ ఖిండో గురువారం కన్నుమూశారు. అతని వయసు 73 సంవత్సరాలు. మైఖేల్ ఖిండోకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. 1975 హాకీ ప్రపంచ కప్, 1972 ఒలింపిక్స్ కాంస్య పతక విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడైన మైఖేల్ ఖిండో వయసు సంబంధిత వ్యాధుల కారణంగా ఈరోజు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
'వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో మైఖేల్ ఖిండో ఇస్పాట్ జనరల్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా తీవ్ర ఒత్తిడితో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా మంచానికే పరిమితమయ్యారు' అని కుటుంబసభ్యులు జాతీయ వార్తా సంస్థ పీటీఐ తెలిపారు. ఇద్దరు కుమార్తెలు శుక్రవారం భారత్ రానున్న నేపథ్యంలో మైఖేల్ అంత్యక్రియలు రేపు పూర్తవుతాయి.
మైఖేల్ ఖిండో మృతిపట్ల హాకీ ఇండియా, ఒడిశా స్పోర్ట్స్, మాజీ ఆటగాళ్లు సంతాపం ప్రకటించారు. 'మా మాజీ హాకీ ఆటగాడు మరియు 1975 ప్రపంచకప్ విజేత మైఖేల్ ఖిండో మరణంతో దిగ్బ్రాంతికి లోనయ్యాం. ఆయన కుటుంబానికి మా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాం' అని హాకీ ఇండియా పేర్కొంది.
'లెజెండరీ హాకీ ఒలింపియన్ మైఖేల్ ఖిండో మృతికి మా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాం. జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. ఒలింపిక్ క్రీడలలో కాంస్యం మరియు ప్రపంచకప్లలో మొత్తం 3 పతకాలను గెలుచుకున్నారు. అతని ఆత్మకు శాంతి చేకూరు గాక' అని ఒడిశా స్పోర్ట్స్ ట్వీట్ చేసింది. 'మీరు మా హృదయాల్లో శాశ్వతంగా జీవిస్తారు మైఖేల్' అని టీమిండియా పేర్కొంది.