
భారత హాకీ జట్టు అద్భుతం చేసింది. 16-0తో ఇండోనేషియాను చిత్తు చేసి 2022పురుషుల హాకీ ఆసియా కప్లో సూపర్ 4కు అర్హత సాధించింది. ఈ విజయంతో ఆసియా కప్ సూపర్ 4రౌండ్లో జపాన్, మలేషియా, దక్షిణ కొరియాలతో కలిసి టీమిండియా చేరింది. ఈ భారీ విజయంతో టోర్నమెంట్లోని నాకౌట్ స్టేజీలోకి భారత్ ప్రవేశించడమే కాకుండా.. పాకిస్థాన్ సూపర్ 4రౌండ్ కు చేరుకోవడానికి తలుపులు మూతపడ్డాయి.
ఒక్క గోల్ తేడాతో పాకిస్థాన్ కంటే మెరుగైన స్థానంలో నిలిచిన భారత్ సూపర్4 రౌండ్ కు చేరుకుంది. సూపర్ 4 రౌండ్ కు చేరుకోవాలంటే భారత్కు 15 గోల్స్ అవసరం. అయితే భారత్ అంతకంటే ఒకటి ఎక్కువగా 16గోల్స్ చేసి అద్వితీయ విజయాన్ని అందుకుంది. చివరి రెండు నిమిషాల్లో పెనాల్టీ కార్నర్ ద్వారా 16వ గోల్ సాధించి సూపర్ 4 రౌండ్ కు చేరుకుంది.
ఇకపోతే ఆసియాకప్ 2022లో భాగంగా పూల్ Aలో భారత్, పాకిస్థాన్, జపాన్ ఇండోనేషియా ఉన్నాయి. అయితే జపాన్ ఆడిన మూడు మ్యాచ్లలో గెలిచి టేబుల్ టాపర్ గా నిలిచింది. కాగా రెండో స్థానం కోసం పాకిస్థాన్, ఇండియా సరిసమానమైన స్టేజీలో ఉన్నాయి. ఈక్రమంలో 2వ స్థానంలో నిలవాలంటే గోల్స్ తేడాను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముంటుంది. ఇక ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్లో తప్పకుండా 15గోల్స్ కంటే ఎక్కువ సాధించాల్సిన పరిస్థితి టీమిండియాకు ఎదురైంది. ఈ తరుణంలో మన హాకీ స్టార్స్.. ఇండోనేషియాపై పూర్తి ఆధిపత్యం కనబర్చుతూ ఏకంగా 16గోల్స్ చేశారు. టీమిండియా తరఫున డిప్సన్ టిర్కీ ఐదు గోల్స్ కొట్టగా.. సుదేవ్ బెలిమగ్గ మూడు గోల్స్ కొట్టారు. SV సునీల్, పవన్ రాజ్భర్, కార్తీ సెల్వం చెరో రెండు గోల్స్ చేయగా, ఉత్తమ్ సింగ్, నీలం సంజీప్ క్సేస్ ఒక్కో గోల్ చేశారు.
అంతకుముందు జపాన్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 2-3 తేడాతో ఓడిపోయింది. ఆసియా కప్లో కొనసాగుతున్న ఎడిషన్లో భారత్కు ఇది తొలి విజయం, పూల్ Aలో మొదటి స్థానంలో నిలిచిన జపాన్ చేతిలో 2-5 తేడాతో ఓడిపోవడానికి ముందు పాకిస్థాన్ చేతిలో టీమిండియా మ్యాచ్ 1-1తో డ్రా అయింది. జపాన్ అన్ని మ్యాచ్ లు గెలిచింది. ఇండోనేషియా ఒక్క మ్యాచ్ గెలవలేదు. ఇక సూపర్ 4లో జపాన్, మలేషియా, సౌత్ కొరియా, ఇండియా ఉన్నాయి.