హైదరాబాద్: గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత హాకీ జట్లు పతకం లేకుండా తిరిగి రావడంతో హాకీ ఇండియా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పురుషుల జట్టు కోచ్ జొయెర్డ్ మరిజ్నేను తప్పించింది. హాలెండ్కు చెందిన మరిజ్నేను మళ్లీ మహిళా జట్టు కోచ్గా నియమిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది.
ఇక, మహిళా హాకీ జట్టు ఇన్చార్జ్ కోచ్గా వ్యవహరిస్తున్న హరేంద్ర సింగ్కు పురుషుల జట్టు కోచ్గా నియమిస్తున్నట్టు హాకీ ఇండియా మంగళవారం ప్రకటించింది. ఇటీవల కామన్వెల్త్ క్రీడల్లో భారత పురుషుల జట్టు ఐదో స్థానంలో నిలవడమే మరిజ్నేపై వేటుకు కారణంగా కనిపిస్తోంది.
కామన్వెల్త్ గేమ్స్లో సీనియర్లు సర్దార్ సింగ్, బీరేంద్ర లక్రా, రమణ్దీప్ సింగ్లను కాదని యువకులకు అవకాశాలివ్వడం, మ్యాచ్లకు జట్టు సన్నద్ధతపై విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే హాకీ ఇండియా కోచ్ల మార్పు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
'హరేంద్ర అపార అనుభవజ్ఞుడు. హాకీ ఇండియా లీగ్లో పురుషుల జట్టు ఆటగాళ్లు పలువురు అతడి కోచింగ్లో ఆడారు. అలాగే జూనియర్ జట్లతోనూ అతడికి ఎంతో అనుబంధం ఉంది' అని హాకీ ఇండియా సెక్రెటరీ జనరల్ మహ్మద్ ముస్తాక్ అహ్మద్ గుర్తుచేశారు.
హాలెండ్కే చెందిన రోలంట్ ఓల్ట్మన్స్పై వేటు వేయడంతో గత నవంబరులో... సహాయక కోచ్గా పనిచేస్తున్న హరేంద్రసింగ్కు బాధ్యతలు అప్పగించకుండా పురుషుల జట్టు కోచ్గా మరిజ్నేను హాకీ సమాఖ్య కోచ్గా నియమించింది. 44 ఏళ్ల మారిన్కు గతంలో పురుషుల కోచ్గా పనిచేసిన అనుభవం లేదు.
దీంతో అతడికన్నా గతంలో పురుషుల జట్టుకు కోచ్గా పనిచేసిన హరేంద్రను నియమిస్తే బావుండేదన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. అయితే మరిజ్నే బాధ్యతలు చేపట్టాక పురుషుల జట్టు.. తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఆసియా కప్ విజేతగా నిలిచింది. అంతేకాదు గత డిసెంబరులో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్లో కాంస్యం గెలుపొందింది.
కానీ 12 ఏళ్ల తర్వాత తొలిసారి భారత జట్టు కామన్వెల్త్లో పతకం సాధించలేకపోయింది. మరోవైపు ఒలింపిక్ ఛాంపియన్ ఇంగ్లాండ్ను కంగుతినిపించిన భారత మహిళలు గోల్డ్కోస్ట్లో అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచారు. కాగా, తాజా మార్పుపై ఇరు జట్ల కోచ్లు హరేంద్రసింగ్, మరిజ్నే సంతృప్తి వ్యక్తం చేశారు.