హోషంగాబాద్ (మధ్యప్రదేశ్): రోడ్డు ప్రమాదంలో నలుగురు జాతీయ స్థాయి హాకీ ఆటగాళ్లు మృతి చెందారు. సోమవారం ఉదయం మధ్యప్రదేశ్ రాష్ట్రం హోషంగాబాద్లోని రాయిసల్పూర్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో నలుగురు హాకీ ఆటగాళ్లు మృతి చెందడంతో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారి-69పై హాకీ ఆటగాళ్లు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది.
IND vs SA: గంగూలీ, అజహరుద్దీన్ల రికార్డు బద్దలు.. ధోనీకి చేరువలో కోహ్లీ!!
ఆటగాళ్లు ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారి అతివేగంగా వెళుతుండంతో.. ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు హాకీ ఆటగాళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. కారులోని మరో ముగ్గురు ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. 'ధ్యాన్చంద్ ట్రోఫీ'లో పాల్గొనేందుకు హాకీ ఆటగాళ్లు ఇటార్సీ నుంచి హోషంగాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
విషయం తెలుసుకున్న హోషంగాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతిచెందిన ఆటగాళ్లను ఇంకా గుర్తించలేదు. 'అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం. దర్యాప్తు చేస్తున్నాం. ఆటగాళ్ల వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అని పోలీసులు తెలిపారు.