భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికారు. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు గుడ్ బై చెబుతున్నట్లు గురువారం ప్రకటించారు. 14 ఏళ్లకే అరంగేట్రం చేసి ఎన్నో అరుదైన ఘనతలు సాధించిన రాణి రాంపాల్ భారత మహిళల హకీకి మకుటం లేని మహారాణిగా ఎదిగారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు స్టార్ ఫార్వార్డ్ రాణి రాంపాల్.
ఆటకు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు రాణి రాంపాల్ చెప్పారు. 16 ఏళ్ల పాటు దేశానికి ప్రాతినిథ్యం వహించి గుడ్బై చెప్పడం అంత తేలికైన విషయం కాదని ఆమె అన్నారు. అయితే ఈ ప్రయాణం ఓ అద్భుతమని, సుదీర్ఘ కాలం, 254 మ్యాచ్లు ఆడతానని, 200 గోల్స్ సాధిస్తానని ఊహించలేదని చెప్పారు. చిన్నప్పటి నుంచి పేదిరకం అనుభవించానని, ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకొని భారత్కు ప్రాతినిథ్యం వహించేలా శ్రమించానని తెలిపారు.

ఒలింపిక్స్ పతకాన్ని సాధించడానికి తీవ్రంగా పోరాడమని, కానీ దగ్గరగా వచ్చి ఆగిపోయామని రాణి రాంపాల్ పేర్కొన్నారు. కానీ భవిష్యత్లో భారత మహిళల జట్టు తప్పకుండా పతకాలు సాధిస్తుందని తెలిపారు. టోక్యో ఒలింపిక్స్లో ఆమె సారథ్యంలోని భారత జట్టు త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. రాణి రాంపాల్ గౌరవార్థం ఆమె జెర్సీ నంబర్ 28కు హాకీ ఇండియా రిటైర్మెంట్ ప్రకటించింది. అలాగే రూ.10 లక్షల నగదు బహుమతి రాణికి అందజేసింది.

కాగా, భారత సబ్ జూనియర్ జట్టుకు ఇటీవల తనని కోచ్గా నియమించారని రాణి రాంపాల్ పేర్కొన్నారు.త్వరలో జరిగే హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో హరియాణా-పంజాబ్కు చెందిన సూర్మా హాకీ మహిళల జట్టుకు కోచ్, మెంటార్గానూ బాధ్యతలు అందుకోనున్నట్లు తెలిపారు.