
లక్నో: కరోనా వైరస్ మహమ్మారి మరో క్రీడాకారుడిని బలి తీసుకుంది. భారత హాకీ దిగ్గజం, మాస్కో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడు రవీందర్ పాల్ సింగ్ కరోనా కారణంగా శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. పదవీ విరమణ తీసుకునే ముందు లక్నోలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సింగ్ పనిచేశారు. రవీందర్ సింగ్ మృతిపట్ల క్రీడారంగం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. భారత హాకీ ఆటగాడు ఎస్వి సునీల్ మాజీ ఒలింపియన్కు సంతాపం తెలిపారు.
కరోనా వైరస్ సోకడంతో ఏప్రిల్ 24న రవీందర్ పాల్ సింగ్ను ఆయన దగ్గరి బంధువులు లఖ్నవూలోని వివేకానంద ఆస్పత్రిలో చేర్చారు. వైరస్ నుంచి కోలుకోవడం, నెగెటివ్ రావడంతో గురువారం ఆయనను సాధారణ వార్డుకు తరలించారు. అయితే శుక్రవారం హఠాత్తుగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటిలేటర్పై ఉంచారు. చికిత్స పొందుతూనే సింగ్ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. హాకీ ఇండియా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజు ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు.
రవీందర్ పాల్ సింగ్ 1984 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లోనూ ఆడారు. కరాచీ వేదికగా జరిగిన 1980, 1983 ఛాంపియన్స్ ట్రోఫీల్లోనూ పాల్గొన్నారు. 1983 సిల్వర్ జూబ్లీ కప్ (హాంకాంగ్), 1982 ప్రపంచకప్ (ముంబై), 1982 ఆసియా కప్ (కరాచీ) పోటీల్లో ఆడారు. 1979లో జూనియర్ ప్రపంచకప్లోనూ ప్రాతినిధ్యం వహించారు. ఆయన తన జీవితాన్ని ఆటకే అంకితం చేశారు. ఆట కోసం వివాహం కూడా చేసుకోలేదు. మేనకోడలు ప్రగ్యా యాదవ్ ఇప్పటి వరకు ఆయనను చూసుకున్నారు.