న్యూఢిల్లీ: భారత హాకీ మాజీ స్టార్ మొహమ్మద్ షాహిద్ బుధవారం (జూలై 20) కన్నుమూశారు. లివర్, కిడ్నీల సమస్యతో గుర్గావ్లోని మెదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను ఈ రోజు చనిపోయారు. ఇతని వయస్సు 56.
అతను కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. దీంతో అతనిని తొలుత వారణాసిలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి గుర్గావ్ ఆసుపత్రికి తరలించారు.
కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ గత వారం మొహమ్మద్ షాహిద్ను ఆసుపత్రిలో కలిశారు. అతని ఆరోగ్య పరిస్థితి పైన వాకబు చేశారు. అంతకుముందు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆయనకు రూ.10 లక్షల గ్రాంట్ ప్రకటించారు.

రైల్వే ఉద్యోగి కావడంతో, అతని చికిత్సకు అయిన ఖర్చును ఆ శాఖ భరిస్తానని ప్రకటించింది. 1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్స్లో వీ భాస్కరన్ సారథ్యంలోని హాకీ టీం గోల్డ్ మెడల్ సాధించింది. ఇందులో మొహమ్మద్ షాహిద్ కూడా ఉన్నారు.
అంతకుముందు, మాజీ హాకీ స్కిప్పర్ ధనరాజ్ పిళ్లై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆర్థిక సాయం గురించి అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత కేంద్రం, రైల్వే శాఖ అతనికి ఆర్థిక పరంగా సహకరించేందుకు ముందుకు వచ్చింది. దీనికి అతను ధన్యవాదాలు తెలిపారు.