హైదరాబాద్: ఆసియా కప్ హాకీ విజేతగా నిలిచిన భారత్ హాకీ మహిళల జట్టుకు హాకీ ఇండియా నగదు నజరానా ప్రకటించింది. జట్టులోని 18 మందికి తలో లక్ష రూపాయల చొప్పున నజారానా ప్రకటించారు. కోచ్ హరేంద్ర సింగ్కు రూ. లక్ష, సహాయ సిబ్బంది ఒక్కొక్కరికి రూ.50 వేలు హాకీ ఇండియా బహూకరించనుంది.
ఫైనల్లో ఒత్తిడిని జయించి ఛాంపియన్గా నిలిచిన భారత్
తాజా విజయంతో మహిళల హాకీ ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత జట్టు రెండు స్థానాలు మెరుగుపరచుకుని పదో స్థానానికి ఎగబాకింది. నెదర్లాండ్స్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆదివారం జపాన్లో ఉత్కంఠగా సాగిన ఆసియాకప్ ఫైనల్లో భారత్ 5-4తేడాతో చైనాను ఓడించిన సంగతి తెలిసిందే.
దీంతో 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల హాకీ జట్టు ఆసియా ఛాంపియన్గా నిలిచింది. షూటౌట్లో గోల్కీపర్ సవిత అద్భుత ప్రదర్శనతో భారత్ను విజేతగా నిలబెట్టింది. నవ్జ్యోత్ కౌర్ (25వ ని) గోల్ చేయడంతో తొలుత టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆ తర్వాత తియాన్తియాన్ లువో (47వ ని)లో గోల్ చేయడంతో చైనా 1-1తో స్కోరు సమం చేసింది. మ్యాచ్ ముగిసే సరికి మరో గోల్ నమోదు కాకపోవడంతో షూటౌట్కు దారి తీసింది. ఉత్కంఠభరితంగా సాగిన షూటౌట్ రెండు జట్లు 4-4తో నిలిచాయి. ఈ సమయంలో కెప్టెన్ రాణి రాంపాల్ ఒత్తిడిని జయించి ఐదో గోల్ సాధించింది.
ఆ తర్వాత చైనా విఫలం కావడంతో భారత్ 5-4తో విజయం సాధించింది. భారత మహిళల జట్టు ఆసియా కప్ గెలవడం ఇది రెండో సారి. 13 ఏళ్ల క్రితం (2004లో) స్వదేశంలో జరిగిన టోర్నీలో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన భారత గోల్ కీపర్ సవిత 'బెస్ట్ గోల్కీపర్'గా ఎంపికైంది.