
ఒక్కొక్కరు ఒక్కో అడ్డుగోడలా..
ఈ విజయంతో క్రీడా ప్రపంచంలో భారత మహిళా హాకీ జట్టు పేరు మారుమోగిపోతోంది. రాణి రాంపాల్ సారథ్యంలోని భారత మహిళా హాకీ జట్టు ఈ టోక్యో ఒలింపిక్స్లో సాధించిన విజయాలు.. పూర్వ వైభవాన్ని గుర్తు చేశాయి. రాణి కేప్టెన్సీలో గుర్జీత్ కౌర్, దీప్ గ్రేస్ ఎక్కా, ఉదిత, నిషా, నేహా, మోనికా, నవ్జోత్ కౌర్, నవ్నీత్ కౌర్, వందన కఠారియా ఒక్కొక్కరు ఒక్కో గోడలా కనిపించి ఉండొచ్చు ఆస్ట్రేలియా జట్టుకు.
పాదరసంలా కదులుతూ.. మెరుపుల్లా బంతిని పాస్ చేసుకుంటూ- బంతిని ఎక్కువ భాగం తమ ఆధీనంలోనే ఉంచుకున్న తీరు.. జట్టుకు తిరుగు లేదనిపించేలా చేసింది. సెమీ ఫైనల్లో జట్టు విజయం లాంఛనప్రాయమే అనిపించేలా చేస్తోంది.

తల్లి పనిమనిషి.. తండ్రి కార్ట్ పుల్లర్
భారత హాకీ జట్టుకు పూర్వ వైభవాన్ని కల్పించడంలో కేప్టెన్ రాణి రాంపాల్ కీలక పాత్ర పోషించారు. గ్రూప్స్ దశలో హ్యాట్రిక్ పరాజయాలు ఎదురైనప్పటికీ.. తోటి ప్లేయర్లలో విజయకాంక్షను రగిలింపజేశారు. జట్టును ముందుండి నడిపించారు. రాణి రాంపాల్ స్వస్థలం హర్యానా కురుక్షేత్ర జిల్లాలోని షాహాబాద్. తండ్రి ఎద్దులబండి నడిపించేవాడు. తల్లి పని మనిషి. తొలిరోజుల్లో విరిగిన హాకీ స్టిక్తో ప్రాక్టీస్ చేసేవారు.
కొత్త హాకీ స్టిక్ను కొనే ఆర్థిక స్థోమత కూడా లేని కుటుంబం ఆమెది. ఆకలి పోరాటం మరోవైపు. రోజూ రెండు పూటల భోజనం చేయడం అదృష్టంగా భావించే కుటుంబం నుంచి వచ్చిన రాణి రాంపాల్.. దేశం గర్వించేలా చేశారు. మహిళా హాకీ జట్టును ఒలింపిక్స్ సెమీస్కు చేర్చారు.

స్కర్ట్ వేసుకోవడం పట్ల అభ్యంతరం..
తన హాకీ ప్రస్థానానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తూ రాణి రాంపాల్ ఇటీవలే హ్యూమన్స్ ఆఫ్ బోంబే అనే సోషల్ మీడియా పేజ్పై ఓ ప్రత్యేక కథనాన్ని రాసుకొచ్చారు. హాకీ మ్యాచ్లల్లో ప్రాక్టీస్ చేయాలంటే స్కర్ట్ తప్పనిసరి. దాన్ని ధరించడానికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. తొలి రోజుల్లో సల్వార్ కమీజ్లోే ప్రాక్టీస్ చేశారు.
ఇలా ప్రాక్టీస్లో పాల్గొనేలా కోచ్ను ఒప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేయాల్సి వచ్చిందని రాణి రాంపాల్ ఈ కథనంలో పేర్కొన్నారు. కరెంటు లేని రాత్రులు.. దోమల బెడద.. వాటన్నింటినీ తప్పించుకుని పోవాలని చాలాసార్లు భావించానని రాసుకొచ్చారు.
కోచ్ సహకారం మరువలేనిది..
కేరీర్లో ఎదగడానికి కోచ్ అందించిన సహకారాన్ని విస్మరించలేనిదని రాణి రాంపాల్ అన్నారు. తనకోసం హాకీ కిట్ను కొనుగోలు చేశారని గుర్తు చేశారు. 15 సంవత్సరాల వయస్సులో జాతీయ జట్టు నుంచి తనకు పిలుపు వచ్చిందని తెలిపారు. చిన్న వయస్సులోనే జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నానని అన్నారు.
తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారం.. 2017లో సొంత ఇంటిని వారికి ఇచ్చానని రాణి రాంపాల్ రాసుకొచ్చారు. ఇప్పుడు కూడా స్వర్ణ పతకంతో టోక్య ఒలింపిక్స్ నుంచి స్వదేశానికి తిరిగి వెళ్లాలని కలగంటున్నానని అన్నారు. అత్యంత కఠిన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనడాన్ని చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకున్నానని చెప్పారు.


Click it and Unblock the Notifications
