
భువనేశ్వర్: పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్కు మరోసారి ఒడిశా ఆతిధ్యం ఇవ్వనుంది. 2023లో జరిగే ప్రపంచకప్ హాకీ టోర్నీకి భువనేశ్వర్, రూర్కెలా కలిసి ఆతిధ్యం ఇస్తాయని బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు. గతేడాది కూడా హాకీ మెగా ఈవెంట్కు భువనేశ్వరే ఆతిథ్యమిచ్చింది. 2018లో జరిగిన ప్రపంచకప్ను విజయవంతంగా నిర్వహించిన భువనేశ్వర్కు మరోసారి ఈ మెగా టోర్నీకి వేదిక కావడం విశేషం.
ఇటీవల అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వరుసగా రెండోసారి కూడా భారత్కే నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. 2023లో జనవరి 13 నుంచి 29 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. బుధవారం కళింగ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ...'ఒడిశాలో హాకీకి భారీ స్పందన ఉంది. మేం 2018 ప్రపంచకప్ హాకీని విజయవంతంగా నిర్వహించాం. 2023 మెగా ఈవెంట్కు కూడా ఆతిథ్యమిస్తాం. చాలా సంతోషంగా ఉంది' అని ప్రకటించారు.
'మేము ఎల్లప్పుడూ హాకీ క్రీడకు మద్దతుగా ఉన్నాం. చాలా మంది హాకీ ప్రేక్షకులను ఒడిశా కలిగి ఉంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో 2023 హాకీ ప్రపంచకప్ను నిర్వహిస్తాం. మెగా టోర్నీకి కోసం నేను ఎదురు చూస్తున్నా. మీరు సంతోషంగా ఉన్నారా. నేను సంతోషంగా ఉన్నాను' అని పట్నాయక్ కళింగ స్టేడియంలో ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించారు.
బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో సహా ఎఫ్ఐహెచ్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా, హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు మహ్మద్ ముస్తాక్ అహ్మద్ పాల్గొన్నారు. జాతీయ శిక్షణ శిబిరం కోసం భువనేశ్వర్లో ఉన్న భారత పురుషుల హాకీ జట్టు కూడా హాజరైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, హాకీ అభిమానులకు నరీందర్ బాత్రా కృతజ్ఞతలు తెలిపారు.