ఇఫో (మలేషియా): చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా (కొవిడ్-19) వైరస్ ప్రభావం త్వరలో జపాన్ దేశంలోని టోక్యో నగరంలో జరగనున్న 2020 ఒలింపిక్స్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే కరోనాతో ఒలింపిక్స్ నిర్వహణపై పలు సందేహాలు నెలకొన్నాయి. ఇదిలాఉంటే.. తాజాగా కరోనా వైరస్ కారణంగా మరో ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ వాయిదా పడింది. మలేషియాలోని ఇఫో నగరంలో జరగాల్సిన అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్ను వాయిదా వేశారు.
సిరీస్ వైట్వాష్.. 8 ఏళ్ల తర్వాత టీమిండియా ఖాతాలో చెత్త రికార్డు!!
షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 11 నుంచి 13 వరకు అజ్లాన్ షా కప్ జరగాల్సి ఉంది. కానీ.. కరోనా ఎఫెక్ట్తో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 మధ్యలో ఈ టోర్నీని నిర్వహిస్తామని నిర్వాహక కమిటీ ఛైర్మన్ రహీమ్ బిన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 'అజ్లాన్ షా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్ 29వ సీజన్ను వాయిదా వేస్తున్నాం. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య, ఆసియా హాకీ సమాఖ్య, మలేషియా హాకీ కాన్ఫడరేషన్, టోర్నమెంట్లో పాల్గొనే జట్లకు తెలియజేశాం' అని రహీమ్ తెలిపారు.
29వ సీజన్ అజ్లాన్ షా కప్లో ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, మలేషియా, పాకిస్థాన్, దక్షిణా కొరియాలు పాల్గొననున్నాయి. అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్లో ఆసీస్ 10 సార్లు, భారత్ నాలుగు సార్లు విజేతగా నిలిచాయి. గత సీజన్ ఫైనల్లో 'షూట్ ఔట్'లో భారత్పై దక్షిణ కొరియా విజయం సాధించి టైటిల్ను ఎగరేసుకుపోయింది.
కరోనా వైరస్ కారణంగా ఆసియా ఛాంపియన్స్ లీగ్ తూర్పు జోన్ నాకౌట్ రౌండ్ల మ్యాచులను కూడా వాయిదా వేశారు. అదనపు తేదీలు మే మరియు జూన్ నెలలో షెడ్యూల్ చేయబడ్డాయి. కొవిడ్ కారణంగా తాజాగా చైనాలో దాదాపు 80 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 2,720కి చేరింది. చైనాతో పాటు ఇతర దేశాల్లోనూ ఈ వైరస్ కలవరపెడుతోంది. దక్షిణ కొరియా, మధ్య తూర్పు దేశాలు, ఐరోపా ఖండంలో ప్రబలింది.