చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు మరో ఘన విజయం సాధించింది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ను చిత్తుగా ఓడించి తదుపరి రౌండ్కు చేరుకున్న భారత జట్టు.. ఈసారి సింగపూర్పై చెలరేగింది. పూల్-ఏ ప్రిలిమినరీ రౌండ్లో భాగంగా జరిగిన ఈ మ్యాచులో భారత జట్టులో ఏకంగా 9 మంది ప్లేయర్లు గోల్స్ చేయడం గమనార్హం.
ఇలా జట్టంతా చెలరేగడంతో భారత్ 16-1 తేడాతో సింగపూర్పై ఘనవిజయం సాధించింది. భారత టీంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, మన్దీప్ సింగ్, వివేక్ ప్రసాద్, గుర్జంత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ, షంషేర్ సింగ్, మన్ప్రీత్ సింగ్, అభిషేక్, వరుణ్ కుమార్ అందరూ గోల్స్ చేయడం విశేషం. ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో రెండు మ్యాచులు ఆడిన భారత్ ఏకంగా 32 గోల్స్ చేయడం గమనార్హం.

అంతకుముందు ఉజ్బెకిస్తాన్ మ్యాచులో కూడా భారత్ ఇలాగే అదరగొట్టింది. ఆ మ్యాచులో ఏకంగా ముగ్గురు భారత ఆటగాళ్లు హ్యాట్రిక్ గోల్స్ సాధించారు. దీంతో భారత్ ఏకంగా 16-0 తేడాతో ఉజ్బెకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. భారత జట్టులో లలిత్ ఉపాధ్యాయ్, వరుణ్ కుమార్ చెరో నాలుగు గోల్స్ వేయడం గమనార్హం.
భారత స్టార్ మన్దీప్ సింగ్ కూడా మూడు గోల్స్తో సత్తా చాటాడు. వీరితోపాటు అభిషేక్, సుఖ్జీత్ సింగ్, అమిత్ రోహిదాస్, సంజయ్ కూడా గోల్స్ చేశారు. ఇక స్క్వాష్లో భారత అమ్మాయిల బృందం కూడా చెలరేగింది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచులో పూర్తి ఆధిపత్యం చెలాయించిన అమ్మాయిలు 3-0 తేడాతో దాయాది దేశం భరతం పట్టారు.
పూల్-బీ టీం మ్యాచులో పాక్కు చెందిన సదియా గుల్ను 11-6, 11-6, 11-3 తేడాతో అనాహత్ సింగ్ ఓడించింది. అలాగే నూర్ ఉల్ హుదా సదీక్ను 11-2, 11-5, 11-7 తేడాతో జ్యోష్ణ చిన్నప్ప చిత్తు చేసింది. చివరి గేమ్లో నూర్ ఉల్ ఎయిన్ ఇజాజ్పై 11-3, 11-6, 11-3 తేడాతో తన్వీ ఖన్నా సునాయాస విజయం సాధించింది. ఈ బృందం బుధవారం నాడు నేపాల్, మకావ్ టీమ్స్తో తలపడుతుంది.