చైనాలోని హాంగ్ జో వేదికగా ఆసియా క్రీడలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ గేమ్స్ పూల్ ఏలో భాగంగా భారత హాకీ జట్టు.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడింది. ఈ మ్యాచులో భారత జట్టు ఏకంగా 10-2 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సమయంలో ఇదే పోటీల్లో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు కూడా హాంగ్ జో చేరుకున్న సంగతి తెలిసిందే.
ఈ మ్యాచులో భారత హాకీ టీం కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ ఏకంగా నాలుగు గోల్స్ చేసి జట్టును ముందుండి నడిపించాడు. అతనితోపాటు మన్దీప్ సింగ్, సుమిత్, వరుణ్ కుమార్, షంషేర్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ కూడా గోల్స్ చేశారు. బదులుగా పాకిస్తాన్ కేవలం 2 గోల్స్ మాత్రమే చేయగలిగింది. ఈ సందర్భంగా భారత హాకీ టీమ్.. మ్యాచ్ ఆడుతుండగా క్రికెట్ టీమ్ అంతా కూడా స్టాండ్స్ లో కూర్చొని హాకీ టీమ్ ను చీర్ చేసింది.

ఆసియా గేమ్స్లో టీమిండియా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠీ, రింకూ సింగ్, అర్షదీప్ సింగ్, ప్రభ్సిమ్రాన్ సింగ్ తదితరులు ప్రేక్షకుల్లా కూర్చొని హాకీ టీంను చీర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా తో భారత జట్టు వన్డే సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ సిరీసులో ఆడిన రుతురాజ్ గైక్వాడ్.. ఆసియా క్రీడలు ఆడుతున్న భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సిరీస్ చివరి వన్డేకు ముందే కుర్రాళ్లతో కూడిన భారత జట్టు.. ఆసియా క్రీడల కోసం చైనా వెళ్ళింది. గైక్వాడ్ తోపాటు రింకు సింగ్, యశస్వి జైస్వాల్ వంటి స్టార్లు ఉన్న భారత జట్టు ఈ క్రీడల్లో ఫేవరెట్ గా బరిలో దిగుతోంది. ఇటీవల భారత మహిళలు ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో భారత పురుషుల టీంపై కూడా ఇదే మాదిరి అంచనాల నెలకొన్నాయి.