
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించాలనుకున్న భారత మహిళల హాకీ జట్టు కోరిక తీరలేదు. అద్భుత విజయాలతో ఫైనల్ చేరిన భారత జట్టు ఫైనల్లో ఒత్తిడికి గురై, రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది
హోరాహోరీగా సాగిన హాకీ ఫైనల్లో భారత మహిళల జట్టు జపాన్ చేతిలో 1-2 తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్లో జపాన్ ఆధిపత్యం మ్యాచ్ ఆరంభం నుంచీ కనిపించింది. ఆట ప్రారంభమైన 11 వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను ఉపయోగించుకున్న జపాన్ క్రీడాకారిణి మియాని షిమ్జూ అద్భుత గోల్ సాధించింది.
దీంతో మొదటి క్వార్టర్ను 1-0 ఆధిక్యంతో జపాన్ ముగిచింది. ఆ తర్వాత 25వ నిమిషంలో భారత క్రీడాకారిణి నేహా గోయల్ గోల్ సాధించి స్కోర్ సమం చేసింది. నవ్నీత్ అందించిన త్రోను అద్బుతంగా గోల్గా మలిచిన నేహా గోయల్, జపాన్ జట్టు ఆధిక్యాన్ని తగ్గించింది.
ఆ తర్వాత మూడో క్వార్టర్ మరో నిమిషంలో ముగుస్తుందనగా లభించిన రెండో పెనాల్టీ కార్నర్ను గోల్గా జపాన్ ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఈ గోల్ని ఆపేందుకు గోల్ కీపర్ సవితా గోల్ పోస్టుకి అడ్డంగా పడుకున్నప్పటికీ, జపాన్ క్రీడాకారిణి కవామురా దానిని సవితా పక్కనుంచి గోల్గా మలిచింది.
జపాన్కు ఆధిక్యం దక్కడంతో సమయం వృథా చేసేందుకే ప్రాధాన్యం ఇచ్చింది. మరోవైపు గోల్ చేసేందుకు భారత ప్లేయర్లు చేసిన ప్రయత్నాలను సమర్థవంతంగా జపాన్ ప్లేయర్లు అడ్డుకున్నారు. ఆట మరో నిమిషంన్నరలో ముగుస్తుందనగా గోల్ చేసే అవకాశం లభించినా భారత జట్టులోని అమ్మాయిలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు.
దీంతో స్వర్ణం చేజారింది. అయితే, భారత మహిళల జట్టు అరుదైన ఘనత సాధించింది. ఇరవై ఏళ్ల తర్వాత ఆసియా గేమ్స్లో రజత పతకం సాధించింది. గత ఏషియాడ్లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్న భారత మహిళల జట్టుకు ఇది మెరుగైన ప్రదర్శనే కావడం విశేషం. అయితే ఓటమితో ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది.
తాజా రజతంతో భారత్ ఖాతాలో 13 స్వర్ణాలు, 23 రజతాలు, 29 కాంస్యాలు కలిపి 65 పతకాలు చేరాయి. దీంతో 2010లో భారత్ సాధించిన 65 పతకాల రికార్డు సమం అయింది. మరోవైపు గత ఆసియా గేమ్స్లో స్వర్ణం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు, ప్రస్తుతం ఆసియా గేమ్స్లో సెమీ ఫైనల్లోనే ఓడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాంస్య పతకం కోసం దాయాది పాకిస్థాన్తో శనివారం పురుషుల జట్టు తలపడనుంది.