
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో పురుషుల హాకీ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 26-0 గోల్స్ తేడాతో హాంకాంగ్పై విజయం సాధించి, భారత హాకీ చరిత్రలోనే సరికొత్త రికార్డును నమోదు చేసింది. 86 ఏళ్ల భారత హాకీ చరిత్రలోనే ఇంత పెద్ద విజయాన్ని ఎన్నడూ సాధించలేదు.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
ఆసియా గేమ్స్ పోటీల్లో భాగంగా బుధవారం హాంకాంగ్-భారత జట్లు పోటీ పడ్డాయి. ఈ పోరులో హాంకాంగ్ హకీ జట్టు భారత ఆటగాళ్ల ముందు నిలవలేకపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తుందని హాకీ విశ్లేషకులు ముందుగానే అంచనా వేశారు.
అయితే, హాకీ విశ్లేషకులు ముందస్తు అంచనాలను తలక్రిందులు చేస్తూ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పూల్-ఏలో భాగంగా ఇండోనేసియాతో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత జట్టు 17-0 తేడాతో ఘన విజయం సాధించింది.
హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో ఆ రికార్డుని తిరగరాసింది. రెండో మ్యాచ్లో కూడా అదే దూకుడుని చూపించింది. ప్రత్యర్ధి హాంకాంగ్కు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా ఏకంగా 26 గోల్స్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. 1932 తర్వాత భారత్ ఇంత భారీ ఆధిక్యంతో గెలవడం ఇదే తొలిసారి.
1932లో లాస్ ఏంజిల్స్లో జరిగిన ఒలింపిక్స్లో భారత్ 24-1 తేడాతో అమెరికాపై విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ వ్యత్యాసంతో గెలవడం. భారత్ తరఫున 14 మంది ఆటగాళ్లు గోల్స్ నమోదు చేశారు. వీరిలో అక్షదీప్, రూపిందర్, లలిత్ తలో మూడు గోల్స్ సాధించగా హర్మన్ప్రీత్ ఏకంగా నాలుగు గోల్స్ సాధించాడు.
1994లో న్యూజిలాండ్ 36-1తో సమోవాపై గెలవడమే అంతర్జాతీయ పురుషుల హకీలో రికార్డు. గతంలో ఇరాన్, బంగ్లాదేశ్ల మీద 12-0 గోల్స్ తేడాతో విజయాలు సాధించారు. ఇదిలా ఉంటే, ఆసియా గేమ్స్లో మహిళల హాకీ జట్టు కూడా సత్తా చాటుతోంది. మహిళల హాకీ జట్టు కజక్స్థాన్ పై మంగళవారం 22-0 గోల్స్ తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.