
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్ ఆదివారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా గేమ్స్ ముగింపు ఉత్సవంలో భారత బృందానికి మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ పతాకధారిగా వ్యవహరించనుందని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది.
ఈ ఆసియా గేమ్స్లో భారత్కి చెందిన దాదాపు 550 మంది క్రీడాకారులు పోటీపడగా మొత్తం 69 పతకాలు లభించాయి. ఇందులో 15 స్వర్ణాలు, 24 రజతాలతో పాటు 30 కాంస్య పతకాలు ఉన్నాయి. ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా మహిళల హాకీ టీమ్ కెప్టెన్ రాణి రాంపాల్ ఎంపికైంది.
ఈ మేరకు భారత ఒలింపిక్ అసోషియేషన్ (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా శనివారం అధికారిక ప్రకటన చేశారు. ఆరంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా భారత జట్టును ముందుండి నడిపించిన సంగతి తెలిసిందే. ఆసియా గేమ్స్లో 20 ఏళ్ల తర్వాత ఫైనల్కి చేరిన భారత మహిళల హాకీ జట్టు శుక్రవారం జపాన్ చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.
అయినప్పటికీ.. రాణి రాంపాల్ జట్టును నడిపించిన తీరుకి మెచ్చిన ఐఓఏ ఆమెకి ఈ అవకాశాన్ని కల్పించింది. అయితే.. ఇప్పటికే చాలా మంది అథ్లెట్స్ ఇండోనేషియా నుంచి భారత్కి వచ్చేశారు. ప్రస్తుతం కొంతమంది మాత్రమే అక్కడ ఉన్నారు. అక్కడ ఎవరైతే ఆటగాళ్లు ఉన్నారో వాళ్లతోనే ముగింపు వేడుకల్లో భారత జట్టు పాల్గొననుంది.