ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. చైనా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. గురువారం దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్లో 3-1తో సత్తాచాటి సెమీస్కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో భారత జట్టుకు ఇది వరుసగా నాలుగో విజయం.
తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టు చైనాను 3-0తో ఓడించిన భారత్, రెండో మ్యాచ్లో జపాన్ను 5-1తో చిత్తు చేసింది. ఇక బుధవారం జరిగిన మూడో మ్యాచ్లో మలేషియాపై సంచలన ప్రదర్శన చేసింది. 8-1 తేడాతో మలేసియాను మట్టికరిపించింది. అదే జోరును దక్షిణకొరియాపై కూడా కొనసాగించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ రెండు గోల్స్తో విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.

అయితే భారత్ ఖాతా తెరిచింది మాత్రం అరైజీత్ సింగ్ హుందాల్. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే ప్రత్యర్థి గోల్ పోస్ట్లోకి అతను బంతిని పంపాడు. 8వ నిమిషంలోనే గోల్ సాధించి సత్తాచాటాడు. ఒక్క నిమిషం వ్యవధిలోనే హర్మన్ప్రీత్ సింగ్ గోల్ కొట్టి భారత్ ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. 43వ నిమిషంలో హర్మన్ మరో గోల్ సాధించాడు. మరోవైపు ప్రత్యర్థి జట్టు 30 నిమిషంలో ఖాతా తెరిచింది. జిహున్ యాంగ్ పెనాల్టీ కార్నర్ మీదుగా గోల్ కొట్టాడు.
కాగా, భారత్ తమ చివరి గ్రూప్ మ్యాచ్లో పాకిస్థాన్తో శనివారం తలపడనుంది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరు జట్లు పోటీపడుతున్నాయి. ఈ టోర్నీ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి.