హైదరాబాద్: ఆసియా కప్ హాకీ టోర్నీలో జోరు కొనసాగుతోంది. సెమీ ఫైనల్ మ్యాచ్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుగా ఓడించి భారత్ ఫైనల్కు చేరింది. ఈ టోర్నీలో గ్రూప్ దశను వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ సెమీస్లో కూడా అదే జోరును కొనసాగించింది.
సూపర్ ఫోర్లో భాగంగా శనివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 4-0తో అద్భుత విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచీ ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో తొలి అర్థభాగంలో రెండు క్వార్టర్లలో ఎవరికీ పాయింట్లు దక్కలేదు. ఎన్నో అవకాశాలు వచ్చినా.. బంతి ఎక్కువ సేపు భారత్ నియంత్రణలోనే ఉన్నప్పటికీ గోల్ మాత్రం నమోదు కాలేదు.

అయితే, 39వ నిమిషంలో సత్భీర్సింగ్ అద్భుతంగా గోల్ చేసి భారత్ను 1-0తో ఆధిక్యంలో నిలిపాడు. నాలుగో క్వార్టర్లో పాకిస్థాన్ ఆటగాళ్లు తడబడ్డారు. అప్పటిదాకా గోల్స్ కోసం ఇబ్బంది పడిన భారత్.. చివరి క్వార్టర్లో విజృంభించింది. దీంతో 41వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్ను హర్మన్ ప్రీత్ గోల్గా మలచి భారత్ ఆధిక్యాన్ని రెండుకు పెంచాడు.
అప్పటి వరకు కాస్త ఒత్తిడిగా కనిపించిన భారత ఆటగాళ్లు ఆ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో ఆడారు. 52వ నిమిషంలో గోల్ పోస్ట్ సమీపంలో బంతిని దొరకబుచ్చుకున్న లలిత్ ఉపాధ్యాయ్ బంతిని నెట్లోకి కొట్టేయడంతో భారత ఆధిక్యం 3-0కు పెరిగింది. మరో మూడు నిమిషాల్లోనే అంటే 57వ నిమిషంలో గుర్జంత్సింగ్ గోల్ చేసి జట్టుకు భారీ విజయాన్ని అందించాడు.
ఈ విజయంతో సూపర్-ఫోర్లో అగ్రస్థానంలో నిలిచిన భారత్ (3 మ్యాచ్ల్లో 7 పాయింట్లు) ఫైనల్లో ప్రవేశించింది. మరో మ్యాచ్లో దక్షిణకొరియాతో 1-1తో డ్రా చేసుకున్న మలేసియా పైనల్కు అర్హత సాధించింది. దీంతో ఆసియా కప్ హాకీ ఫైనల్లో భారత్ మలేసియాతో తలపడనుంది.