హైదరాబాద్: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత్ జట్టు విజయాల పరంపర కొనసాగుతోంది. ఢాకా వేదికగా గురువారం మలేషియాతో జరిగిన మ్యాచ్లో 6-2తో భారత్ ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన భారత జట్టు అసాధారణ ప్రదర్శన కనబరిచారు.
కొత్త కోచ్ జోయెర్డ్ మరిన్ మార్గదర్శకంలో భారత హాకీ ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. ఈ మ్యాచ్లో భారత ప్లేయర్లు అందివచ్చిన అవకాశాలను గోల్స్గా మలచడంలో సఫలమయ్యారు. భారత ఆటగాళ్లు ఆకాశ్దీప్ సింగ్, ఎస్కె ఉతప్ప, గుజరాత్ సింగ్, ఎస్వీ సునీల్, సర్దార్ సింగ్లు తమ ప్రదర్శనతో గోల్స్ సాధించారు.

ఇక, మలేషియా జట్టులో రజి రహీమ్, రమ్దాన్ రోస్లీలు చెరో గోల్ సాధించారు. తాజా విజయంతో ఆసియా కప్ టోర్నీలో భారత్ సూపర్ ఫోర్కు చేరుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. సూపర్ ఫోర్ దశలో భారత్ తన చివరి మ్యాచ్లో పాకిస్థాన్తో ఆడుతుంది.
ఈ మ్యాచ్ శనివారం(21వ తేదీన) జరగనుంది. సూపర్-4లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి. అంతకముందు బుధవారం కొరియాతో జరిగిన మ్యాచ్లో 0-1తో ఓటమి ఖాయమనుకుంటున్న సమయంలో మరో నిమిషంలో ఆట ముగుస్తుందనగా భారత్ అద్భుత గోల్ చేసి 1-1తో డ్రాతో గట్టెక్కింది.