రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్ 2016లో భారత్కు మంగళవారం కొంత ఊరట కలిగేలా ఫలితాలన్నించింది. హాకీలో భారత్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టగా, ఆర్చరీలో ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లాడు అతాను దాస్. అంతేగాక, బాక్సింగ్లో వికాస్ కృష్ణన్ తొలి మ్యాచ్లో విజయం సాధించి ప్రీక్వార్టర్స్కు దూసుకెళ్లాడు. ఇక మిగితా విభాగాల్లో భారత్కు నిరాశే మిగిలింది.
హాకీ విషయానికొస్తే.. మెరుగైన ఆటతీరును కొనసాగిస్తూ ఒలింపిక్ టోర్నీలో రెండో విజయంతో కార్వర్టర్ఫైనల్లో స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది భారత్. మంగళవారం ఉత్కంఠగా ముగిసిన మ్యాచ్లో 2-1తో అర్జెంటీనాను ఓడించింది. తొలి మూడు క్వార్టర్స్లో భారత్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది.
చింగ్లేన్సన సింగ్ (8వ నిమిషం), కొతాజిత్ సింగ్ (35వ)ల గోల్స్తో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఐతే చివరి క్వార్టర్స్లో అర్జెంటీనా గొప్పగా పుంజుకుంది. పదేపదే దాడులతో భారత్ను తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. దీంతో మన జట్టు ఆఖరి 15 నిమిషాల్లో ఏకంగా ఐదు పెనాల్టీ కార్నర్లు ఇచ్చింది. 49వ నిమిషంలో గొంజాలో పీలట్ చేసిన పెనాల్టీ కార్నర్ గోల్తో భారత్ ఆధిక్యాన్ని అర్జెంటీనా 2-1కి తగ్గించింది.

జర్మనీతో మ్యాచ్లోలాగే ఆఖర్లో గోల్ ఇచ్చి భారత్ దెబ్బతింటుందేమోనన్న భయం కలిగింది. గోల్కీపర్ శ్రీజేశ్ గోడలా నిలిచి ఉండకపోతే భారత్ మరో పరాభవం చవిచూసేదే. అతడు ఐదు సేవ్లు చేశాడు. ఈ విజయంతో భారత్ 6 పాయింట్లతో పూల్-బిలో రెండో స్థానానికి ఎగబాకింది. తన తర్వాతి మ్యాచ్లో గురువారం లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత నెదర్లాండ్స్తో తలపడుతుంది. భారత్ తన తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై గెలిచిన సంగతి తెలిసిందే.
బ్రిటన్ చేతిలో భారత్ మహిళల ఓటమి
మహిళల హాకీ రెండో మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో భారత్ 0-3తో గ్రేట్ బ్రిటన్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. 25వ నిమిషంలో అన్సెలె చేసిన గోల్తో ఆధిక్యంలోకి వెళ్లిన బ్రిటన్.. తర్వాత నీల్ హాగ్వుడ్, అలెక్స్ డాన్సన్ చేసిన గోల్స్తో విజయాన్ని ఖాయం చేసుకుంది.
బాక్సింగ్లో వికాస్ కృష్ణన్ శుభారంభం
రియో ఒలింపిక్స్ బాక్సింగ్ 75 కిలోల విభాగంలో భారత్కు చెందిన వికాస్ కృష్ణన్ శుభారంభం చేశాడు. తొలి మ్యాచ్లో విజయం సాధించి ప్రీక్వార్టర్స్కు దూసుకెళ్లాడు. అమెరికాకు చెందిన కాన్వెల్ చార్లెస్పై 3-0 తేడాతో గెలుపొందిన వికాస్.. మూడు రౌండ్లలోనూ ఒక్కో పాయింట్ (29-28, 29-28, 29-28) తేడాతో గెలుపొందాడు. ప్రీక్వార్టర్స్లో టర్కీకీ చెందిన సిపల్ వండెర్తో వికాస్ తలపడనున్నాడు.

ఆర్చరీలో మెరిసిన అతాను దాస్
ఆర్చరీలో అతాను దాస్ అద్భుత ప్రదర్శనతో వ్యక్తిగత రికర్వ్లో ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లాడు. ఉత్కంఠభరితంగా జరిగిన రెండో రౌండ్లో అతాను దాస్ 6-4తో అండ్రియాస్ ప్యుంటెస్ పెరెజ్(క్యూబా)పై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లను అలవోకగా గెలుచుకున్న అతాను 4-0 పాయింట్లతో ఆధిక్యంలోకి దూసుకెళ్లి అలవోకగా గెలిచేలా కనిపించాడు.
కానీ పెరెజ్ పుజుకుని తర్వాతి రెండు సెట్లను గెలిచి స్కోరు 4-4తో సమం చేయడంతో పోరు ఉత్కంఠగా మారింది. ఐతే నిర్ణయాత్మక ఐదో సెట్లో రెండు 10లు స్కోరు చేయడం ద్వారా అతాను పైచేయి సాధించాడు.
అంతకుముందు తొలి రౌండ్లో అతడు అదిరే ప్రదర్శన చేశాడు. 6-0తో నేపాల్కు చెందిన ముక్తాన్ను చిత్తు చేశాడు. అతాను మొత్తం ఏడుసార్లు పది పాయింట్లు స్కోరు చేశాడు. క్వార్టర్స్లో స్థానం కోసం అతాను 12న దక్షిణ కొరియాకు చెందిన లీ స్యుంగ్తో తలపడతాడు. ర్యాంకింగ్ రౌండ్లో అతాను ఐదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
హీనా 25మీ పిస్టల్లో విఫలం
షూటింగ్లో భారత్ పేలవ ప్రదర్శనలో ఎలాంటి మార్పూ లేదు. హీనా సిద్దూ మహిళల 25మీ పిస్టల్ ఈవెంట్లోనూ విఫలమైంది. కనీసం ఫైనల్ కూడా చేరలేకపోయింది. దీంతో ఒలింపిక్స్ నుంచి వెనుదిరిగింది. 10మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కూడా హీనా ఫైనల్ చేరని సంగతి తెలిసిందే.
రోయింగ్లో ముగిసిన పోరు
రోయింగ్లోనూ భారత్ కథ ముగిసింది. పోటీలో ఉన్న ఏకైక భారతీయుడు దత్తు బాబన్ బొకానన్ పురుషుల సింగిల్స్ స్కల్స్లో క్వార్టర్స్ దాటలేకపోయాడు. క్వార్టర్స్లో నాలుగో స్థానంలో నిలిచి నిష్క్రమించాడు. తొలి మూడు స్థానాలు సాధించిన రోయర్లు సెమీఫైనల్కు చేరుకున్నారు. కాగా, మూడో స్థానంలో నిలిచిన రోయర్కు దత్తుకు మధ్య తేడా ఆరు సెకన్లే.