
టోక్యో: వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరుగనున్న ఒలింపిక్స్లో భారత హాకీ జట్ల షెడ్యూల్ ఖరారైంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) టోక్యో ఒలింపిక్స్కు సంబంధించి ఈవెంట్ షెడ్యూల్ను మంగళవారం విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం తొలి మ్యాచ్ల్లో భారత పురుషుల జట్టు న్యూజిలాండ్తో.. మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడనున్నాయి.
వచ్చే ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యో ఒలింపిక్స్ జరగనున్నాయి. జూలై 24న భారీ స్థాయిలో ప్రారంభోత్సవ వేడుకలు ఉంటాయి. ఆ తర్వాతి రోజు (జూలై 25న) నుండి హాకీ మ్యాచ్లు మొదలవుతాయి. ఈ మెగాటోర్నీలో భారత జట్లు తొలి రోజే బరిలో దిగనున్నాయి. గ్రూప్-ఏలో భాగంగా తొలి మ్యాచ్లో భారత పురుషుల జట్టు న్యూజిలాండ్తో తలపడనుండగా.. జూలై 26న ఆస్ట్రేలియాతో, 28న స్పెయిన్తో, 30న డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో, 31న జపాన్తో తలపడనుంది.
గ్రూప్-ఎలోనే ఉన్న భారత మహిళల జట్టు జూలై 25న నెదర్లాండ్స్తో తన తొలి పోరును ప్రారంభించనుంది. జూలై 27న జర్మనీతో, జూలై 29న బ్రిటన్తో, జూలై 31న ఐర్లాండ్తో, ఆగస్టు 1న దక్షిణాఫ్రికా జట్లతో భారత మహిళలు పోటీపడనున్నారు. భారత పురుషుల జట్టు ఎనిమిదిసార్లు చాంపియన్ అన్న విషయం తెలిసిందే.
గత నెలలో క్వాలిఫయర్స్లో భాగంగా భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో జరిగిన ఎఫ్ఐహెచ్ రెండో అంచె పోటీల్లో మన్ప్రీత్ సింగ్ కెప్టెన్సీలోని భారత పురుషుల జట్టు రష్యాను చిత్తు చేసి ఒలింపిక్స్కు అర్హత సాదించింది.మరోవైపు మహిళల జట్టు అమెరికా చేతిలో ఓడింది. అమెరికా గెలిచినా.. రెండు మ్యాచ్లలో చేసిన మొత్తం గోల్స్లో భారత మహిళలు ముందంజలో ఉండడంతో ఒలింపిక్స్ బెర్త్ దక్కింది.