
హైదరాబాద్: టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మాంచెస్టర్ యునైటెడ్ జట్టుకు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. తన అభిమాన ఫుట్బాల్ క్లబ్ మంచి ప్రదర్శన ఇచ్చానా లేక నిరాశ పరిచినా తన అభిప్రాయాన్ని మాత్రం వెల్లడిస్తూనే ఉంటాడు. ప్రీమియర్ లీగ్లో మాంచెస్టర్ యునైటెడ్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ని యువీ వీక్షిస్తుంటాడు.
తాజాగా ప్రీమియర్ లీగ్లో మాంచెస్టర్ యునైటెడ్ జట్టు న్యూకాజిల్ యునైటెడ్ జట్టు చేతిలో 1-0తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం యువరాజ్ సింగ్ తన ట్విట్టర్లో 'కఠిన సమయం ఎప్పుడూ ఉండదు. కఠినమైన మనుషులు ఉంటారు' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్మన్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు.
పీటర్సన్ తన ట్విట్టర్లో "మాంచెస్టర్లో ఎవరూ కఠినంగా లేరు!" అంటూ యువరాజ్ సింగ్ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ కామెంట్ చేశాడు. అయితే, వీరిద్దరూ ఇలా ఒకరిపై మరొకరు కౌంటర్లు వేసుకోవడం ఇదే తొలిసారి కాదు. పీటర్సన్ చెల్సీయా జట్టుకు అభిమాని కావడంతో గతంలో వీరిద్దరి మధ్య ట్విట్టర్ వార్ నడిచింది.
ప్రీమియర్ లీగ్లో భాగంగా ఆదివారం జేమ్స్ పార్క్ వేదికగా మాంచెస్టర్ యునైటెడ్ , న్యూకాజిల్ యునైటెడ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో న్యూకాజిల్ జట్టు విజయం సాధించింది. మరోవైపు తాజా ఓటమితో మాంచెస్టర్ జట్టు ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం తొమ్మిది పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 12వ స్థానంలో నిలిచింది.
గత ఆగస్టులో మాంచెస్టర్ జట్టు చెల్సీయా జట్టుని 4-0తో ఓడించగా యువీ ట్వీట్ చేస్తూ పీటర్సన్ను ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. "మిస్టర్ కెవిన్ పీటర్సన్ ఇవాళ మౌనంగా ఉన్నావ్? అంతా సవ్యంగానే ఉందా?" అంటూ యువరాజ్ ఆట పట్టించాడు. యువీ ట్వీట్కు పీటర్సన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.